తెలుగుయూనివర్సిటీ : సాహిత్య, సాంస్కృతిక రంగంలో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సముపార్జించిన దేవులపల్లి రామానుజరావు సమాజ వికాసానికి ఎంతో దోహదపడ్డారని మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ దేవులపల్లి రామానుజరావు 104వ జయంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా దేవులపల్లి రామానుజరావు పేరిట ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ దేవరాజుకు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. 25వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికను పురస్కారంకింద అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ మానవ హక్కుల్లో సాహితీసృజన గౌరవప్రదమైన జీవన హక్కు కిందకు వస్తుందని పేర్కొన్నారు. దేవులపల్లి రామానుజరావు మార్గంలో ఎదిగి కవిగా, రచయితగా, విజ్ఞాన శాస్త్రవేత్తగా కృషి సాగించిన దేవరాజు మహారాజుకు రామానుజరావు పురస్కారం అందజేయడం సముచితమని అన్నారు.
పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన రామానుజరావు న్యాయమూర్తిగా సేవలందించడంతో పాటు తెలుగు భాష కోసం నెలకొల్పబడిన సారస్వత పరిషత్తు కోసం జీవితం అంకితం చేశారని గుర్తు చేశారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య మాట్లాడుతూ పరిషత్తుకు యాబై ఏళ్ళ పాటు రామానుజరావు అవిరళ సేవలందించారని పేర్కొన్నారు. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.