కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. సోమవారం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు కృష్ణకాలనీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు 14వ ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి రూ. 5 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ. 2 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులల్లో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతలోపం లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, 6వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల మౌనికాశ్రీనివాస్, టీఆర్ఎస్ 6వ వార్డు అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ నాయకుడు సూరం రాజేశ్, కాలనీ వాసులు సమ్మీరెడ్డి, శంకర్లాల్, సాంబశివరావు, రాజేశ్వరి, ముఖేశ్, డిష్ రవి, అరుణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.