తీగలగుట్టపల్లి వద్ద బ్రిడ్జి కోసం వినోద్కుమార్ ఇటీవలే వినతి
స్పందించిన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్
న్యూఢిల్లీలోని రైల్వే బోర్డ్కు లేఖ
తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్కు లేఖ ద్వారా సమాచారం
కరీంనగర్, మే 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్లో అత్యంత కీలకమైన కరీంనగర్- తీగలగుట్టపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)పై కదలిక వచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం న్యూఢిల్లీలోని రైల్వే బోర్డ్కు లేఖ రాసినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ జీవీ రమణారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కు తెలిపారు. ఆర్వోబీ పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇటీవల న్యూఢిల్లీలోని రైల్వే బోర్డ్ చైర్మన్తో సహా సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినోద్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ మేరకు స్పందించిన దక్షిణ మ ధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి గురువారం వినోద్ కుమార్కు లేఖను పంపించారు.
ఆర్వోబీ అవసరాన్ని వివరిస్తూ న్యూఢిల్లీకి లేఖ రాసిన విషయాన్ని చీఫ్ ఇంజినీర్ అందులో పేర్కొన్నారు. తీగలగుట్టపల్లి వద్ద కరీంనగర్ రైల్వేస్టేషన్ దగ్గర రాష్ట్ర రహదారిపై ఆర్ఓబీ నిర్మించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఎంపీగా ఉన్న సమయంలోనే 2014 – 2019 మధ్య పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవలే వినోద్కుమార్ రైల్వే బోర్డు చైర్మన్కు లేఖ పంపించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం ద్వారా రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపి రెండేళ్లవుతున్నా ఢిల్లీ స్థాయిలో ఇంకా పెండింగ్లోనే ఉందని ఆ లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆర్వోబీ మంజూరు విషయంపై తక్షణమే నిర్ణయం తీసుకుని పనులను వెంటనే ప్రారంభించాలని రైల్వే బోర్డు చైర్మన్ను కోరారు. ఆర్వోబీల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయాన్ని సైతం వినోద్ కుమార్ రైల్వే బోర్డ్ చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే జీఎంలకు రాసిన లేఖలలో పేర్కొన్న విషయం తెలిసిందే.