న్యూఢిల్లీ, జూలై 9: భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం చాలా ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి కేవలం ఒక ఆశగా మిగిలిపోరాదని, దానిని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. మీనా కమ్యూనిటీకి చెందిన ఇద్దరు దంపతుల విడాకుల కేసుపై ఈ నెల 7న ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల, మత, వర్గపరమైన అంతరాలు క్రమంగా సమసిపోతున్నాయని, భారతదేశం ఏకత్వం దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువత తాము పెండ్లి చేసుకొనే/విడాకుల కోరే సందర్భంలో మతపరమైన చట్టాల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితిని తొలగించాలన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను గతంలో సుప్రీంకోర్టు కూడా నొక్కి చెప్పిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం ప్రభుత్వ విధి అని ఆమె స్పష్టం చేశారు. మతంతో సంబంధం లేకుండా వివాహ, వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం విభిన్న మతాలకు విభిన్న రకాల వివాహ, వారసత్వ చట్టాలు ఉన్నాయి.