సికింద్రాబాద్, మే 5: ఉస్మానియా యూనివర్సిటీలోని క్యాంపు నం.6లో నెలక్నొ విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. క్యాంపు నం. 6కు చెందిన దాదాపు 30 మంది నివాసాల్లో నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. అప్పటికప్పుడు విద్యుత్ శాఖ అధికారులతో, ఉస్మానియా యూనివర్సిటీ వీసీతో చర్చించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ సొంత నిధులు రూ. లక్షతో కేబుల్ను కొనుగోలు చేసి ఇచ్చి..వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. కేవలం కొన్ని నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎంతో ఇబ్బంది పడతామని, అది నాలుగైదు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడం బాధాకరమన్నారు.రంజాన్ కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్టీ శేఖర్, వైవీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలతో పాటు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో బుధవారం సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని.. వాటి ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు ప్రారంభం అయితే రోడ్లు వేయడం ఇబ్బందికరంగా మారుతుందని, నాలాల్లో పూడికను తొలగించడం పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే కొన్నిచోట్ల పూడికను తీసినప్పటికీ అనుకున్నస్థాయిలో పూర్తి చేయలేకపోయారని అన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈఈకి అభినందనలు..
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా బాధ్యతలు తీసుకున్న ఆశలతకు డిప్యూటీ స్పీకర్ అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్ సర్కిల్లో ఈఈగా విధులు నిర్వహించిన లక్ష్మణ్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో అంబర్పేట సర్కిల్ నుంచి ఆశలత బదిలీపై వచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈలు శశిధర్రెడ్డి, మాధురీ తదితరులు పాల్గొన్నారు.