సికింద్రాబాద్, జూన్ 22: సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడం కోసం నిరంతరం వారికి అందుబాటులో ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని పలు ప్రాంతాల్లో రూ. 2.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా మురికి కూపాలుగా ఉన్న బస్తీలను ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు. కోట్లాది రూపాయలతో మౌలిక వసతులను కల్పించామని వివరించారు. చిలకలగూడ బడీమసీదు, కిందిబస్తీ, భవానీనగర్, అన్నానగర్, ఉప్పరిబస్తీ, ఫ్రైడే మార్కెట్, మహ్మద్గూడ తదితర ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, కార్పొరేటర్ హేమ, జీహెచ్ఎంసీ ఈఈ ఆశ, నాయకులు రామేశ్వర్గౌడ్, మున్నూరు చందు, గోపకుమార్, రవికాంత్, ప్రశాంత్, రవీందర్సాగర్, గౌస్, జయశ్రీ, రేవతి, విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.