సికింద్రాబాద్, జూన్ 17: ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. వర్సిటీ సిబ్బంది సంక్షేమంతో పాటు విద్యార్థుల వసతుల మెరుగుదలకు కృషి చేస్తామని చెప్పారు. డిప్యూటీ స్పీకర్తో వర్సిటీ ఉప కులపతి ఫ్రొఫెసర్ రవీందర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం గరురువారం భేటీ అయ్యింది. సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ ప్రాంగణంలోని పద్మారావుగౌడ్ క్యాంపు కార్యాలయంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమావేశం జరిగింది. ఓయూను దేశం లో ఉత్తమ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు తాము తపిస్తున్నామని, ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ కోరారు. వివిధ పెండిగ్ అంశాలపై డిప్యూటీ స్పీకర్ వారితో కూలంకషంగా చర్చించారు. పరస్పర సహకార ధోరణితో పనిచేయాలని నిర్ణయించారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ వర్సిటీ పరిధిలోని వివిధ క్యాంపుల్లో నివాసుల సదుపాయాల కల్పననకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే సి బ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా సహకరిస్తామని, ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులకు కరోనా రహిత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వీసీ రవీందర్ తదితరులు డిప్యూటీ స్పీకర్కు జ్ఞాపికను అందజేశారు. వర్సిటీ రిజిస్ట్రా ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు హేమ, రాసూరి సునీత పాల్గొన్నారు.