సికింద్రాబాద్, మే 28: రాష్ట్ర వ్యాప్తంగా కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్తో పాటు సూపర్ స్ప్రెడర్స్గా ఉన్న వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేస్తుందని పేర్కొన్నారు . శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సూపర్ స్ప్రెడర్స్కు సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనావల్ల ప్రజా జీవితమే అల్లకల్లోలంగా మారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యత కల్పించాల్సి వస్తోందని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 10వేల మంది సూపర్ స్ప్రెడర్స్కు పదిరోజుల్లో టీకాలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, తీగుళ్ల రామేశ్వర్గౌడ్, కార్పొరేటర్లు హేమ, సునీత, ప్రసన్న లక్ష్మీ, శైలజ తదితరులు పాల్గొన్నారు.