సికింద్రాబాద్, సెప్టెంబర్ 25: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న హరితహరంతో నగర రూపురేఖలు మారాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిలకలగూడలోని మున్సిపల్ మైదానంలో శనివారం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి పద్మారావు గౌడ్ హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు.పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా లాంటి వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు.
సీతాఫల్మండి డివిజన్ పరిధిలో రూ. 23.50 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సివరేజీ పైప్లైన్ నిర్మాణ పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. చిలకలగూడలోని ఎరుకల బస్తీ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ప్రాంతాల్లో పనులను ప్రారంభించిన అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో తాగునీటి సమస్యలను పరిష్కరించగలిగామని, సివరేజీ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. శ్రీనివాస్నగర్ కాలనీలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను నార్త్జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత, కంది శైలజ, డీసీ మోహన్రెడ్డి, జలమండలి జనరల్ మేనేజర్ రమణారెడ్డి, అధికారులు ఆశలత, రాఘవేందర్, ఆయా విభాగాల అధికారులతో పాటు టీఆర్ఎస్ నేతలు కిషోర్కుమార్గౌడ్, రామేశ్వర్గౌడ్తో పాటు జ్యోతి, కాలనీ సంఘం ప్రతినిధులు విజయ్, లక్ష్మి, వాసు పాల్గొన్నారు.