సికింద్రాబాద్, మే 16: నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేసిన వారే నిజమైన నాయకులుగా వెలుగొందుతారని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేయడమే కాకుండా రెమ్డెసివిర్ ఇంజక్షన్లను కూడా అత్యవసర పరిస్థితిలో అందజేస్తూ ప్రాణాలను కాపాడుతున్నామన్నారు. మాదిగ హక్కుల దండోరా ఉద్యోగుల విభాగం రాష్ట్ర కన్వీనర్, టీఆర్ఎస్ నాయకుడు కందుల సాయినాథ్ ఆధ్వర్యంలో సీతాఫల్మండిలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ క్యాంపు కార్యాలయంలో పద్మారావుగౌడ్కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు అండగా ఉంటున్నామని తెలిపారు. గత ఏడాది రూ.కోటిన్నర వెచ్చించి 10వేల మందికి నిత్యావసర సరుకులు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, బొగ్గుల కృష్ణ, భాస్కర్, రాజేశ్ సింగ్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.