సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 28 : చిలకలగూడలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంతో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న 187 దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులకు బుధవారం రాత్రి రూ. 87లక్షల విలువచేసే బోనాల చెక్కులను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పంపిణీ చేశారు. ప్రధానంగా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిపే ఉత్సవాలకు రూ. 10 లక్షల చెక్కును ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్కు అందిస్తూ బోనాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
తార్నాక డివిజన్ వినోభానగర్లోని మైసమ్మ, పోచమ్మ దేవాలయంలో వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష చెక్కును డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆలయ కమిటీ ప్రతినిధులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు శ్యామ్కుమార్, ఎర్ర నాగరాజు, వెంకటేశ్, శివరాం పాల్గొన్నారు.