సికింద్రాబాద్, జూలై 21: జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత తాగునీటి పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కోరారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉచిత తాగునీటికి సంబంధించిన కరపత్రాన్ని జలమండలి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన నెలకు 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని పద్మారావుగౌడ్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటున్న వినియోగదారులందరూ ఆన్లైన్, మీసేవ, జలమండలి కార్యాలయాల్లో తమ ఆధార్ కార్డు, క్యాన్ నంబర్ను తీసుకొని వెళ్లి అనుసంధానం చేసుకోవాలన్నారు. ఆగస్టు 15లోపు అనుసంధానం చేసుకోకుంటే వారు గత డిసెంబర్ నుంచి నీటిని వాడుకున్నందుకు నల్లా బిల్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. నల్లా కనెక్షన్కు ఆధార్ అనుసంధానం చేసుకొని మీటర్ కూడా బిగించుకోవాలని తెలిపారు.