ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 9: సికింద్రాబాద్ సర్కిల్లోని తార్నాక డివిజన్ను నగరంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి వెల్లడించారు. అధికారులు, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి తార్నాక డివిజన్లోని మాణికేశ్వరీనగర్లో బుధవారం ఆమె పాదయాత్ర నిర్వహించారు. స్థానికులతో మాట్లాడుతూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నాలా పూడిక పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాలాలో ఉన్న పూడికను తొలగించకపోతే వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీలోని వాటర్లైన్లో లీకేజీ ఉండడంతో మంచినీటి సరఫరాలతో తగినంత ప్రెషర్ రావడం లేదని వాపోయారు. స్థానికంగా బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలని, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, పవర్బోర్, స్వచ్ఛ ఆటోలు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ వర్షం నీరు సాఫీగా నాలాలోకి వెళ్లేందుకు చర్యలు తీసుకుంటూ నాలా పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, ఏఎంహెచ్వో రవీందర్గౌడ్, జలమండలి డీజీఎం డేవిడ్ రాజు, మేనేజర్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.