కంటోన్మెంట్, జూన్ 5:కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసింది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కొనసాగుతున్న నాలా ప్రహరీ నిర్మాణ పనుల కారణంగా ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం, జాజల గ్రామానికి చెందిన ఆంజనేయులు న్యూ బోయిన్పల్లి, ఆనంద్నగర్ కల్వర్టు నాలా వద్ద ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య చంద్రకళ, ఇద్దరు కుమారులు చరణ్ జీత్, ఆనంద్సాయి(7) ఉన్నారు. ఆనంద్సాయి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటున్నాడు.
కాగా.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆనంద్సాయి..మరో బాలుడితో కలిసి ఇంటికి నాలాకు మధ్యనున్న కొద్దిపాటి స్థలంలో ఆడుకుంటున్నాడు.. ఆనంద్సాయి ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పడిపోయాడు. మరో బాలుడి సమాచారంతో ఆనంద్సాయి తండ్రి, స్థానికులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గజఈతగాళ్లు ట్యాంక్ బండ్ శివ బృందంతో గాలింపు చేపట్టారు.. సుమారు రెండుగంటల పాటు గాలించి.. ట్యాంక్బండ్ శివ నాలా అడుగు వరకు వెళ్లి బాలుడిని వెలికి తీశాడు. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. నాలా ప్రహరీ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బాలుడు అందులోపడి మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనకు కారణమైన కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ చీఫ్ ప్లానర్ రాములు తెలిపారు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదుమేరకు కాంట్రాక్టర్ రాముపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.