దుండిగల్, జూలై 18: సూరారంలోని నారాయణ మల్లారెడ్డి వైద్యశాలలో శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు వదిలివెళ్లిన మహిళ మృతదేహం మిస్టరీని దుండిగల్ పోలీసులు ఛేదించారు. మృతురాలి సెల్ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా ఆమెను గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలు నగరంలోని బోరబండకు చెందిన మమత(27)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. మమత తల్లి గతంలో మరణించగా, తండ్రి గతేడాది కొవిడ్తో మృత్యువాత పడ్డాడు. అప్పటికే మమతకు రెండుసార్లు వివాహమైంది. కట్టుకున్న వారితో వచ్చిన విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో సూరారం డివిజన్ పరిధిలోని శివాలయనగర్కు చెందిన యాదగిరితో మూడు నెలలుగా సహజీవనం చేస్తుంది. యాదగిరి రోజువారీ మాదిరిగానే శుక్రవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళ్లి చూడగా.. మమత ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన యాదగిరి వెంటనే ఆమెను కిందకు దింపి, చికిత్స నిమిత్తం ఆటోలో మల్లారెడ్డి నారాయణ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మమత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆటోడ్రైవర్తో పాటు యాదగిరి భయాందోళనకు గురై అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నదని సీఐ రమణారెడ్డి తెలిపారు.