దుండిగల్, ఫిబ్రవరి 4: అర్ధరాత్రి కూలీలతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్కు చెందిన 17 మంది కూలీలు మేడ్చల్ జిల్లా, గౌడవెల్లిలోని ఓ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డీసీఎం వ్యాన్లో గౌడవెల్లి నుంచి ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో రోడ్డు పని నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీఎం గండి మైసమ్మ చౌరస్తా నుంచి సూరారం వైపు వస్తుండగా బహదూర్పల్లిలోని శ్రీరామ్నగర్ గడ్డ మూలమలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో చంద్రమౌళి(40), కిరణ్(38) అక్కడికక్కడే మృతి చెందారు. వికాస్(29), సునీల్ (25)అనే మరో ఇద్దరు కూలీలు తీవ్రగాయపడ్డారు. వీరితో పాటు చెన్నకేశవరావు, సీతారామయ్య, నిరంజన్, రాజేందర్, శివ తదితరులతో పాటు మరో 8 మంది క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జీ చేశారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించి దుండిగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.