న్యూఢిల్లీ, మే 31: మొదటి డోసులో ఒక కంపెనీ వ్యాక్సిన్, రెండో డోసులో మరో కంపెనీ టీకా వేసుకుంటే కరోనాకు వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుందా? ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వినియోగిస్తున్న ‘కొవిషీల్డ్’ సింగిల్ డోసుతోనే కొవిడ్-19 నుంచి పూర్తి రక్షణ లభిస్తుందా? దేశంలో టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం తదితర కారణాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా పరిశోధనలను ముమ్మరం చేసింది. అన్నీ కుదిరితే వచ్చే నెల రోజుల్లో ‘కొత్త వ్యాక్సిన్ ప్లాన్’ ప్రయోగాలు మొదలుకానున్నాయి.
‘కొవిషీల్డ్’ సింగిల్ డోస్ సరిపోతుందా?
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థ సౌజన్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ సింగిల్ డోస్ కరోనా నుంచి పూర్తి రక్షణను ఇవ్వగలదా? ఈ మేరకు త్వరలో ఓ అధ్యయనాన్ని చేపట్టనున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. నెల రోజుల్లో ఈ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్-వీ లైట్లు సింగిల్ డోస్ టీకాలేనని, ఇదే ఫార్ములాతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను (భారత్లో కొవిషీల్డ్) తయారు చేశారని పేర్కొన్నారు. దీన్ని బట్టి కొవిషీల్డ్ సింగిల్ డోస్ తీసుకుంటే కరోనా నుంచి రక్షణ లభించవచ్చని అభిప్రాయపడ్డారు.
మిక్సింగ్-మ్యాచింగ్
రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్సింగ్-మ్యాచింగ్ చేస్తే (తొలి డోసులో ఒక కంపెనీ టీకా, రెండో డోసుగా మరో కంపెనీ టీకా ఇవ్వడం) కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగనిరోధకశక్తి శరీరంలో ఉత్పత్తి అవుతుందో లేదో తెలుసుకునేందుకు త్వరలోనే ప్రయోగాలు చేపట్టనున్నారు. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్టీఏజీఐ) కింద ఏర్పాటైన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లోనే ఈ ప్రయోగాలు మొదలుకానున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టునాటికి దేశంలో నెలకు సగటున 20-25 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో ‘కొవిషీల్డ్’, ‘కొవాగ్జిన్’ టీకాలను వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ‘స్పుత్నిక్-వీ’ టీకానూ ఇస్తున్నారు.
‘మిక్సింగ్తో’ దుష్ప్రభావాలు ఉంటాయా?
రెండు వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడం ద్వారా తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. యూపీలోని సిద్ధార్థ్నగర్ జిల్లాలో ఇటీవల 20 మందికి తొలిడోసుగా ‘కొవిషీల్డ్’ వేశారు. అయితే రెండోడోసుగా పొరపాటున ‘కొవిషీల్డ్’కు బదులుగా ‘కొవాగ్జిన్’ వేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పై వివరణ ఇచ్చింది. వ్యాక్సినేషన్లో రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను వినియోగించడం శాస్త్రీయంగా, సిద్ధాంతపరంగా ఆచరణాత్మకమేనని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ పేర్కొన్నారు. అయితే, ఈ విధానంతో రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితం అవుతుందో లేదో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మరోవైపు, రెండు వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడం ద్వారా తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తినట్టు గుర్తించలేదని లాన్సెట్ పత్రిక ఇటీవల పేర్కొంది. వ్యాక్సిన్ల మిక్సింగ్తో యాంటీబాడీల వృద్ధి గణనీయంగా పెరిగినట్టు స్పెయిన్ పరిశోధకులు తెలిపారు. 14 రోజుల వ్యవధిలో తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా, రెండో డోసుగా ఫైజర్ టీకాను ఇచ్చి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టినట్టు తేలడంతో రెండో డోసులో వేరే వ్యాక్సిన్ తీసుకోవాలని జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ తమ పౌరులకు సూచించాయి.