హిమాయత్నగర్, ఆగస్టు 2: రాష్ట్రంలోని దళితుల సామాజిక పురోభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలిపారు. హిమాయత్ నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ, దళితుల జీవన విధానంలో మరింత మార్పు తీసుకురావాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం సంతోషకరమన్నారు. దళిత బంధు పథకంపై అవగాహన లేకుండా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల నాయకులు వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక చట్టం, జీవో జారీ చేసి ఈ పథకానికి చట్టబద్ధత కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయాలని కోరారు. సమావేశంలో యాదగిరి, ఈశ్వర్, ప్రవీణ్ కుమార్, చంద్రమౌళి పాల్గొన్నారు.