రవీంద్రభారతి, జూలై 15: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అరాచకాలను ప్రజలకు తెలియజేసేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్ర తి గ్రామంలో త్వరలోనే బస్సు యాత్ర చేపడుతామని ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ వెల్లడించారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన ఈటల బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే ఈటల బాధితులతో కలిసి ఈ బస్సు యాత్రను చేపడుతున్నామన్నారు. గతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అక్రమాలను ప్రశ్నించినందుకు తమపై రౌడీషీట్, పీడీ యాక్ట్లు నమోదు చేయించి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన మంత్రిగా ఉన్నంత కాలం హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగలేక పోయామని చెప్పారు. అన్యాయంగా దళితుల భూములు లాక్కోవడం, ప్రశ్నించిన వారిపై తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా కేసులు పెట్టి వేధించేవారన్నారు. తక్షణమే సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్రెడ్డి స్పం దించి తమపై పెట్టిన అక్రమ కేసులు, పీడీ యాక్ట్లపై సమగ్ర విచారణ జరిపించి.. కేసులను ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాజేశ్వర్రావు, అపర్ణ, శ్రీదేవి, భార్గవి, రమేశ్, సుధాకర్, యాసన్న, రాహుల్, స్వామి, శంకర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.