సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్కు చెందిన పార్థీ గ్యాంగ్.. సంవత్సరంలో 11 నెలలు చోరీలకు పాల్పడుతూనే ఉంటారు.. ఒక్క నెల మాత్రం నేరాలకు దూరంగా ఉంటారు.. అది రాఖీ పౌర్ణమికి 15 రోజులు, హోలీ పండుగకు 15 రోజులు ఇంటి వద్దనే ఉం టూ దొంగతనాల జోలికి వెళ్లరు..మిగతా రోజులు దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసుకుని… అక్కడ తాత్కాలిక గుడారాలను వేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు.. ఇలా.. గత మూడు నెలలుగా దాదాపు 20 చోరీలకు పాల్పడ్డారని సైబరాబాద్ పోలీసుల విచారణలో తేలింది.
మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా ప్రాంతానికి చెందిన పార్థీ గ్యాంగ్.. కొన్ని రోజుల కిందట దాదాపు 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి నగర శివారు కొంపల్లి-బొల్లారం రోడ్డులో మకాం వేశారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి అల్వాల్, పేట్ బషీరాబాద్, మేడ్చల్, దుండిగల్ తదితర ప్రాంతాల్లో దాదాపు 20 దొంగతనాలకు పాల్పడ్డారు.. వరుస చోరీలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. రంగంలోకి దిగి ఘటన జరిగిన ప్రాంతాలను విశ్లేషించారు. అదే విధంగా అక్కడ జరిగిన నేరప్రక్రియ.. ఇతర దొంగలతో పోల్చిచూశారు.. ఎక్కడ కూడా ఒక్క క్లూ దొరకలేదు. చివరకు సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన ఆధారంగా.. తీగను లాగితే మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా పార్థీ గ్యాంగ్గా తేలింది. చోరీలకు పాల్పడేది 15 మంది ఉండగా… వారి కుటుంబ సభ్యులందరూ కలిపి దాదాపు 60 మంది గుడారాల్లో తిష్ట వేశారని తేలింది. ఈ గ్యాంగ్లోని పురుషులు చోరీలు చేసి సొత్తును తీసుకొస్తే.. వాటిని మహిళలు, చిన్న పిల్లలు దాచిపెడుతుంటారు.. ఆ తర్వాత మహారాష్ట్రలోని ఓ రిసీవర్కు ఈ బంగారం, వెండి ఆభరణాలను విక్రయించి.. వచ్చిన డబ్బును అందరూ సమానంగా పంచుకుని.. జల్సా చేస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది.
ఈ ముఠా సభ్యులు.. ఉదయం పూట రుద్రాక్షలు విక్రయిస్తున్నట్లు గల్లీలో తిరుగుతారు. ఎక్కడ కూడా వాటిని విక్రయించరు. కేవలం పోలీసుల దృష్టిని మళ్లించేందుకు రుద్రాక్షను చేతిలో పెట్టుకుని తిరుగుతూ తాళాలు ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్లను గుర్తిస్తారు. ఆ తర్వాత రాత్రి 1 గంట దాటిన తర్వాత పెద్ద కత్తులు, గొడ్డళ్లు తీసుకొని తాళాలను పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. అదే అపార్ట్మెంట్లో ఫ్లోర్కు రెండు ఫ్లాట్లకు తాళాలు ఉంటే 15 మంది ఆ ఫ్లోర్లను పం చుకుని చోరీలకు తెగబడుతారు. ఎవరైనా చూసి వీరిని అడ్డుకునేందుకు యత్నిస్తే ఆయుధాలతో భయపెట్టిస్తారు. లేదంటే దాడి చేస్తున్నట్లు నటిస్తారు. ఇలా.. ఈ దొంగల ముఠా టార్గెట్ చేసిన ప్రాంతానికి 15 మంది కలిసి వెళ్తారు. తెల్లవారు జాము 3 గంటల వరకు చోరీలను పూర్తి చేసుకుని.. తిరిగి తాత్కాలిక గుడారాలకు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.
ఈ ముఠా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లో పంజా విసిరారు. చివరకు సైబరాబాద్ పోలీసులు ప్రణాళిక బద్ధంగా కార్యచరణను రూపొందించుకుని ఇటీవల ఈ ముఠాలోని 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారులు పరారీలో ఉన్నారు. ప్రధాన సూత్రధారులు బల్వ, ఠాకూర్, పెక్లోడ్, కలాంల వయస్సు 20 సంవత్సరాలేనని పోలీసులు గుర్తించారు.