కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 10 : మహిళను ఎరగావేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 14 మంది ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరివద్ద ఆటో, 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ సీఐ లక్ష్మినారాయణ, డీఐ నాగేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో సికింద్రాబాద్, వారసీగూడ, చిలకలగూడ, ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల్లో నివసించే 14 మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. మెదక్లో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన శైలజ వ్యభిచారం కేసులో గతంలో అరెస్టయినప్పుడు స్వాతి పరిచమైంది. వీరికి గంధం విశాల్, బాజిని నవీన్, రాము, వికాస్లతో పాటు మరికొందరు తోడు కావడంతో ఓ ముఠాగా ఏర్పడ్డారు. రోడ్డు పక్కన వెళ్తున్న మగవారిని స్వాతి, శైలజ ఆకర్షించే ప్రయత్నించగా.. మిగిలిన ముఠా సభ్యులు రంగప్రవేశం చేసి కత్తులతో బెదిరించడం.. వారిని గాయపరిచి డబ్బులు, బంగారు గొలుసులు, సెల్ఫోన్లు తస్కరించి పారిపోతారు.
ఈ క్రమంలోనే ఈనెల 2న కేపీహెచ్బీ కాలనీ రోడ్డుపై నిలుచున్న వెంకటేశ్వర్రెడ్డి అనే వ్యక్తి వద్దకు వచ్చిన శైలజ వివిధ మాటలతో కవ్వించే ప్రయత్నం చేయగా అతను బుట్టలో పడలేదు. వెంటనే కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి అతనిపై దాడిచేసి పారిపోగా గాయాలతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో ఈనెల 5న కరసాల వేణు అనే ప్రైవేట్ ఉద్యోగిని ఈ ముఠాలోని స్వాతి బుట్టలోకి లాగింది. అతని పల్సర్ బండిపై ఎక్కింది జేఎన్టీయూహెచ్ రోడ్డులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం వద్ద డబ్బులు తీస్తుండగా అక్కడే ఆటోలో తిష్టవేసి ఉన్న ఓ మహిళ, నలుగురు వ్యక్తులు కలిసి అతనిపై బండరాయితో దాడిచేశారు. రెండు తులాల బంగారం, నాలుగు గ్రాముల ఉంగరం, ఒక సెల్ఫోన్ను తస్కరించి పారిపోయారు. శుక్రవారం రాత్రి కేపీహెచ్బీ కాలనీ రైతుబజార్ సమీపంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆటో నంబర్ (టీఎస్ 09 యూబీ 6258)గా తేలడంతో ఆ ముఠాలోని మిగిలిన వ్యక్తులను పట్టుకున్నారు. ఈ ముఠాలో గంధం విశాల్, బాజిన నవీన్, రాము, వి.శైలజ, చెరుకూరి స్వాతి, వికాస్, గుండె నవీన్, బీరం మధు, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, సయ్యద్ మరియా, జంబ్లీ శివకుమార్, దుర్గా కలిసి 14 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎనిమిది మందిని (విశాల్, నవీన్, శైలజ, స్వాతి, గుండె నవీన్, బీరం మధు, మరియా, శివకుమార్) లను అరెస్ట్ చేయగా మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠానుంచి 1.5 తులాల బంగారు ఆభరణాలు, 13 సెల్ఫోన్లు, కత్తితో పాటు వీరు దోపిడీలకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకుని పట్టుబడిన వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.