సిటీబ్యూరో, నవంబర్ 06(నమస్తే తెలంగాణ): మావోయిస్టులుగా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన నలుగురు.. డబ్బులు సంపాదించేందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సొంతంగా తుపాకులను కూడా తయారు చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్వోటీ పోలీసులు శనివారం ఉదయం యాదిగిరిగుట్టలో నిందితులను పట్టుకున్నారు. నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం..పిట్టల శ్రీనివాస్ అలియాస్ శీనన్న, వల్లాల నాగ మల్లయ్య అలియాస్ మల్లేశ్, ఎడవల్లి శ్రీనివాస్రెడ్డి, గంగాపురం స్వామి, అశోక్ కొన్ని ఏండ్ల పాటు జనశక్తి, పీపుల్స్ వార్ గ్రూపుల్లో పని చేసి.. ప్రభుత్వానికి లొంగిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
పిట్టల శ్రీనివాస్ బొమ్మల తయారీ, వల్లాల నాగమల్లయ్య కూలీగా, ఎడవల్లి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం, గంగాపురం స్వామి డ్రైవర్గా, అశోక్ జిరాక్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వీరు చేస్తున్న పనులతో వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. దీంతో శ్రమ తక్కువగా ఉండి.. భారీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వీరంతా కలిశారు. యాదగిరిగుట్టతో పాటు రియల్ బూమ్ అధికంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని అక్కడ పేరొందిన వ్యాపారులు, ఇతర సంపన్నుల చిట్టాను రెడీ చేసుకుని వారిని తుపాకీతో బెదిరించి.. డబ్బులు వసూలు చేయాలని పథకం రచించారు.
భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ పేరుతో లెటర్ హెడ్ను రూపొందించారు. నిఘా వర్గాలకు ఈ మాజీ మావోయిస్టుల కదలికలపై అనుమానం కలగడంతో రాచకొండ పోలీసులను అప్రమత్తం చేశారు. యాదగిరిగుట్టలో నాగమల్లయ్య ఇంట్లో వీరందరూ సమావేశమైనట్లు గుర్తించిన ఎస్వోటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు దేశవాళీ తుపాకులు, బుల్లెట్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అరెస్టు అవ్వగా, ఐదో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు.
ముఠాలోని ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్ సొంతంగా తుపాకులను తయారు చేసే పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఏయిర్ పిస్టల్, ఏయిర్ రివాల్వర్లను ఆన్లైన్లో కొనుగోలు చేసి.. వాటిని దేశవాళీ తుపాకులుగా మార్చుతున్నాడు. బుల్లెట్లను కూడా రూపొందిస్తున్నాడు. ఈ తుపాకులతో ఇతడు కొన్ని దోపిడీ ఘటనలకు కూడా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మాజీ మావోయిస్టులను పట్టుకున్న ఎస్వోటీ, యాదగిరిగుట్ట పోలీసులను సీపీ మహేశ్ భగవత్ అభినందించి రివార్డులను అందించారు.