సిటీబ్యూరో, అగస్టు 12(నమస్తే తెలంగాణ)/వనస్థలిపురం: ఓ దొంగల ముఠా పోలీసులకు చిక్కకుండా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అడుగడుగునా.. ఆ ముఠా సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆధారాలు దొరక్కుండ చేసినా.. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఆ దొంగలు ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు. దాదాపు రూ.26 లక్షలకు పై విలువజేసే సొత్తును కొల్లగొట్టారు. కమిషనర్ మహేశ్ భగవత్ ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ రవికుమార్తో పాటు పలు టీంలను రంగంలోకి దించారు. గురువారం నేరస్తులను అరెస్ట్ చేశారు.
వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన షేక్ వసీం(22), ఆదిలాబాద్ జిల్లా తానూర్కు చెందిన షేక్ అమీర్ పాత నేరస్తులు. వీరిపై తెలంగాణ, మహారాష్ట్రలో పలు కేసులు ఉన్నాయి. దొంగతనాల కోసం హైదరాబాద్ను ఎంచుకున్న వీరు.. ఇక్కడికి వచ్చాక అమీర్కు దగ్గర బంధువైన కంచన్బాగ్ నివాసి షేక్ ఫిరోజ్(21) సహాయం తీసుకున్నారు. ముందుగానే నిజామాబాద్లో ఓ బైక్ను చోరీ చేశారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లికి వచ్చి ఓ లాడ్జిలో దిగారు. ఫిరోజ్ను అక్కడికి పిలిపించుకున్నారు. సంపన్న ఇండ్లను చూడమని చెప్పారు.
అతడు మీర్పేట్ ప్రాంతాన్ని చూపెట్టాడు. అక్కడ తిరుగుతూ.. తాళం వేసిన ఇండ్లను గుర్తించి టార్గెట్ చేశారు. జూలై 27న మీర్పేట్ విశాఖ నగర్లోని గుమ్మడిదల మల్లేశ్ ఇంట్లోకి చొరబడి రూ.70వేల విలువైన బంగారం, వెండిని తస్కరించారు. అదేరోజు అదే కాలనీలో నారోజు కుమార స్వామి గృహంలో రూ.40వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దొంగలించారు. ఆగస్టు 2న మీర్పేట్ శ్రీకృష్ణ కాలనీలోని డాక్టర్ విద్యానంద్ ఆర్య ఇంటి తాళం పగలగొట్టి రూ.25.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చోరీ చేసిన ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటంతో దొంగలు డీవీఆర్ను ఎత్తుకు పోయారు. పోలీసులు బ్యాకప్ తీయకుండా ఉండేందుకు చెరువులో పడేశారు. ఆ తర్వాత బైక్ పై 10 కిలో మీటర్ల వరకు ముగ్గురూ వచ్చారు. ఈ సమయంలో పలు సార్లు డ్రైవర్లు మారారు. ఆ తర్వాత ఒకరిని ఆటో లేదా బస్సులో లాడ్జికి రమ్మని ఇద్దరు ద్విచక్రవాహనంపై వెళ్లారు.. ఇలా పోలీసులను తికమక పెట్టి.. ఎక్కడా క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డారు.
కేసును సవాలుగా తీసుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు సీసీ కెమెరాలను సమర్థవంతంగా విశ్లేషించారు. ఎక్కడా గందరగోళానికి గురికాకుండా దృశ్యాలను సరైన విధంగా మ్యాపింగ్ చేసుకుని నాంపల్లి లాడ్జి వరకు చేరుకున్నారు. అక్కడ దొంగల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించడంతో వారు దొరికిపోయారు. అనేక అంశాల్లో దృష్టిని మళ్లించినా.. పోలీసులు అత్యంత వేగంగా క్లూ సంపాదించి.. అరెస్టు చేయడంతో ఆ నేరస్తులు
అవాక్కయ్యారు.