కరోనా బారిన పడిన వారికి సైబరాబాద్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారిని భాగస్వామ్యం చేసుకుని వైరస్ దూకుడుకు.. మూకుతాడు వేస్తున్నారు. హోం క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి మానసిక ైస్థెర్యాన్ని నింపి ఆలోచనా విధానాన్ని మార్చేస్తున్నారు. కమిషనరేట్లో కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధితులు ఫోన్ చేయగానే కావాల్సిన సేవలు అందజేస్తున్నారు. అంతేకాకుండా ఆందోళన చెందకండి.. మాకు ఫోన్ చేయండి.. మాతో మాట కలపండి.. మీ బాధను, సమస్యను పంచుకోండి.. మీకు మేమున్నాం.. అంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇలా పోలీసులు అందజేస్తున్న సేవలు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నాయని, ఇక ఎలాంటి కలత చెందాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ప్రత్యేక కొవిడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారు ప్లాస్మా కోసం సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ వైపే చూస్తున్నారు. బాధితులు 9490617440 ఫోన్ చేయగానే అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ప్లాస్మా దాతలను పంపిస్తున్నారు. రెండో దశలో ఇప్పటివరకు సుమారు 3200మంది ప్లాస్మా దాతలను అందించి దాదాపు 6400మందికి అండగా నిలబడ్డారు. దీనికి పోలీసులతో పాటు ఎస్సీఎస్సీ(సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్) వలంటీర్లు చాలా కష్టపడుతున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వృద్ధులు, గర్భిణులు, డయాలసిస్ రోగుల కోసం ప్రత్యేకంగా ఉచిత అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టారు. కరోనా బారిన పడినవారిని దవాఖానలో చేర్పించేందుకు ఈ ఉచిత అంబులెన్స్లు ఉపయోగపడుతున్నాయి. దాదాపు 12 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం నగర ప్రజలు మాత్రమే ఈ సేవలు ఉపయోగించుకునేలా ఎస్సీఎస్సీ వారు అవకాశం కల్పించారు. ప్రతిరోజు 20నుంచి 30మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ వారు కలిసి కరోనాతో కలవరానికి గురవుతున్న ప్రజలకు ఊరటను కలిగించేందుకు ఓ ప్రత్యేక ఉచిత కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7గంటల వరకు ఈ కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే.. సుమారు 20మంది డాక్టర్లు అందుబాటులో ఉండి.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 450మంది ఫోన్ చేసి డాక్టర్లతో మాట్లాడి వారి సలహాలు తీసుకుంటున్నారు.
బెడ్స్, వెంటిలేటర్స్, ఐసొలేషన్ బెడ్స్, అక్సిజన్ సిలిండర్లు, అక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, దవాఖానలో బెడ్స్ ఖాళీ ఇలాంటి విషయాలు సమగ్రంగా ఒకే వేదికపై లభించే విధంగా ఈ వెబ్ సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వెబ్సైట్ ప్రారంభమైన వారం రోజుల్లోనే 90వేల మంది వీక్షించి వారికి కావాల్సిన సేవలను పొందారు.