హైదరాబాద్ : నగర పౌరుల కోసం సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) కొవిడ్ టెలి మెడిసిన్ కన్సల్టేషన్ కాల్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్, తెలంగాణలో మెడికల్ & హెల్త్ కేర్ వ్యవస్థ చాలా ఒత్తిడికి గురౌతుందన్నారు. డాక్టర్ రాజీవ్ మీనన్ నేతృత్వంలో ఈ అంతరాన్ని తగ్గించేందుకు సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ ఈ కాల్ సెంటర్ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కాల్ సెంటర్తో కొవిడ్ సంబంధిత సందేహాలను తీర్చడంతో పాటు తక్షణ ప్రాథమిక అవసరాలను పరిష్కరించగలుగుతామన్నారు. తద్వారా వారి భయాందోళనను తగ్గించగలుతామన్నారు.
ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ యోదులా మాట్లాడుతూ.. ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి గానీ లేకుండా గానీ కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయితే అటువంటి వారు తమ టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ కాల్ సెంటర్ +918045811138 కు కాల్ చేయాల్సిందిగా సూచించారు. అటువంటి వ్యక్తులకు కొవిడ్ లక్షణాలపై ఉచిత సలహాలు అందివ్వడంతో పాటు చికిత్స, పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో ప్రవేశం, వ్యాక్సినేషన్, జాగ్రత్తల్లో మార్గదర్శకత్వం చేయనున్నట్లు తెలిపారు.
ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ మీనన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్న కాంటినెంటల్ హాస్పిటల్స్, సన్షైన్ హాస్పిటల్స్, సిటిజెన్స్ హాస్పిటల్స్, మెడికోవర్ హాస్పిటల్స్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.