దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తును సైబరాబాద్ పోలీసులు క్షేమంగా బాధితుల చేతికి అందించారు. 176 కేసులకు సంబంధించిన దాదాపు రూ.కోటిన్నర విలువజేసే సొత్తును నేరుగా మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ సజ్జనార్ బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో షీ టీమ్స్ డీసీపీ అనసూయ, ఎస్ఓటీ డీసీపీ సందీప్కుమార్, అదనపు డీసీపీ మాణిక్రాజ్, ఏడీసీపీ క్రైమ్స్ కవితదారా, ఇందిర, రాంచంద్రుడు,స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్యాంబాబు, తదితర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
చోరీ జరిగింది.. కేసు నమోదైంది.. దొంగలు దొరికారు.. సొత్తు కూడా దొరికింది. బాధితుల సమయం వృథా కాకుండా.. డబ్బుల భారం లేకుండా.. పోయిన సొత్తు వారి చేతికి చేరింది. ప్రతి అంశంలో పోలీసులు ఎంతో కష్టపడి పని చేశారు. బాధితులకు సొత్తు అందించడంలో జరుగుతున్న ఆలస్యాన్ని కూడా దూరం చేశారు. న్యాయబద్ధమైన నిబంధనలను పాటించి కోర్టు అధికారుల సమన్వయంతో సొత్తును బాధితులకు అందించేందుకు ఎంతో కృషిచేశారు. నేరుగా బాధితులకు సొత్తును అందించి.. వారిలో ఆనందాన్ని నింపారు. ఈ కేసుల్లో పోగొట్టుకున్న కిలో బంగారం, 3.60 కిలోల వెండి, రూ. 30 లక్షల నగదు, 90 వాహనాలు, 35 మొబైల్ ఫోన్లను పోలీసులు సంబంధిత బాధితులకు అందించారు.
నేను ఫోన్ మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఫోన్ లాగేసుకుని వెళ్లిపోయాడు. ఫోన్ పోయిందని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు దొంగను పట్టుకున్నారు. పోయి న ఫోన్ తిరిగి లభించడం చాలా సంతోషంగా ఉంది. తులసి, బాధిత యువతి
పోయిన సొత్తును త్వరగా చూసుకోవాలనే ఆతృత ప్రతి బాధితుడిలో ఉంటుంది. వస్తువు దొరకగానే చేతికి అందాలనే ఆశ కూడా ఉంటుంది. అయితే, కోర్టుల చుట్టూ తిరగాలనే భయం ఉండేది. ఈ కార్యక్రమంతో బాధితుల్లో భయం, ఆందోళన పోతుంది. బాధితుల్లో సంతోషం నెలకొంటుంది. – ప్రకాశ్రెడ్డి, డీసీపీ శంషాబాద్ జోన్
ప్రజలు తమ వాహనాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పని తొందరలో రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోతున్నారు. వాటిని దొంగలు సులభంగా కొట్టేస్తున్నారు. 70 శాతం నేరాలు నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తును రికవరీ చేస్తున్నాం. – పద్మజా, డీసీపీ బాలానగర్
పోలీసుల ముఖ్య ఆశ యం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం. ప్రతి కేసులో నిందితులను అరెస్టు చేయడంతోపాటు పోయిన సొత్తును కూడా రికవరీ చేస్తున్నాం. ప్రాధాన్యతకు అనుగుణంగా సైబరాబాద్ పోలీసులు పనిచేసి.. పోయిన సొత్తును రికవరీ చేశారు. నేరుగా బాధితుల చేతికి అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు, పోలీసుల మధ్య భాగస్వామ్యాన్ని బలపరుస్తాయి. – ఎస్ఎం విజయ్కుమార్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్
దొంగతనాలు, దోపిడీ లు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు సొత్తును రికవరీ చేయడం చాలా కష్టం. నేరగాళ్లలో ఇతర రాష్ర్టాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది చేసే పోరాటం చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. వారిని పట్టుకున్న తర్వాత వారు కాజేసిన సొత్తును రికవరీ చేయడంలో అనేక ముళ్ల దారులు దాటాల్సి ఉంటుంది.- సజ్జనార్, సీపీ, సైబరాబాద్