ప్రతిరోజూ చెత్త సేకరణతో వీధులు శుభ్రం
ఊరిలో ఎటు చూసినా పచ్చదనమే
పక్కా ప్రణాళికతో మౌలిక వసతులు
అద్దంలా సీసీ రోడ్లు
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ఆలేరురూరల్, జూన్7 : పల్లె ప్రగతి కార్యక్రమం రాఘవాపురం గ్రామ రూపురేఖలే మార్చేసింది. ప్రభుత్వ సహకారం.. గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తుండటంతో పరిసరాలు శుభ్రంగా మారాయి. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టడంతో అంటురోగాలు దూరమయ్యాయి. పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న రకరకాల పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో కాలనీలో రోడ్లు లేక బురదమయంగా ఉండేది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతిలో భాగంగా గ్రామపంచాయతీలకు నిధుల వరద మొదలైంది. రాఘవాపురం గ్రామపంచాయతీకి జనాభా ప్రాతిపదికన ఏడాదికి సుమారుగా రూ.17లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామంలోని అన్ని గల్లీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో కష్టాలు తీరాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
ప్రభుత్వం అందించిన నిధులతో పల్లె ప్రకృతి వనానికి పలు రకాల పండ్లు, పూల మొక్కలు నాటి ప్రతిరోజు వాటికి నీరు పోసి సంరక్షిస్తున్నారు. ఎటు చూసినా పచ్చ అందాలతో విలేజ్ పార్క్ గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది.
జరిగిన ప్రగతి
గ్రామంలో రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.1.50 లక్షలతో పల్లె ప్రకృతి వనం రూ.2.50లక్షలతో కంపోస్ట్షెడ్, రూ.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.9 లక్షలతో టాక్టర్ కొనుగోలు చేశారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం పూర్తయింది. మిషన్ భగీరథ ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది. పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. క్రమం తప్పకుండా వీధుల్లో బ్లీచింగ్పౌడర్ చల్లుతున్నారు. వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేస్తున్నారు. దీంతో గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తుంది. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంచాయతీ ట్యాంకర్ సాయంతో ప్రతి రోజు మొక్కలకు నీళ్లు పెడుతున్నారు.