సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(సీఏహెచ్టీయూ) అమాయకులను కాపాడేందుకు పకడ్బందీగా పని చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 32 మందిని కాపాడటం తో పాటు 76 మంది నిందితులను అరెస్ట్ చేసింది. మొత్తం 14 కేసులను నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టి.. పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడుగురు, మహారాష్ట్ర-7, తెలంగాణ-4, ఏపీ-3, కర్నాటక-7, న్యూఢిల్లీకి చెందిన నలుగురిని కాపాడి.. వారిని పునరావాస కేంద్రాలకు, వారి సొంత ఊళ్లకు పంపించారు. ఆపరేషన్ స్మైల్-7లో భాగంగా భిక్షాటన, చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, బాలకార్మికులుగా పని చేస్తున్న వారిని గుర్తించి.. వారిని వారివారి ఊర్లకు పం పించారు. ఇదిలా ఉండగా.. మియాపూర్లోని ఓ హోంకు చెందిన బాలికపై హూస్సేని ఆలం పీఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న సీఏహెచ్టీయూ పూర్తి వివరాలు సేకరించి.. ఆ బాలికను గుర్తించి.. కర్నూల్లో ఉన్న వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ బాలికపై మిస్సింగ్ కేసు 2005లో నమోదయ్యింది.
గుర్తించి.. అప్పగించారు
ఉత్తర్ప్రదేశ్లో నమోదైన ఓ బాలిక, బాలుడు అదృశ్యమైన కేసును సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్కు అప్పగించారు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు , ఉత్తర్ప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన బాలికకు షేర్ చాట్, ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఆమెను మీరట్ నుంచి రాజస్థాన్ తీసుకువచ్చాడు. ఈ ఘటనపై గంగానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. అయితే వారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటున్నారని తెలిసింది. దీంతో వారి ఆచూకీని గుర్తించే బాధ్యతను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్కు అప్పగించారు. రంగంలోకి దిగిన ఏహెచ్టీయూ విభాగం అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని గుర్తించి ఉత్తర్ప్రదేశ్ గంగానగర్ పోలీసులకు అప్పగించారు. వీరిని గుర్తించే ప్రక్రియలో బాలుడు 30 ఐఎంఈ నంబర్లు, 9 ఫోన్ నంబర్లను ఉపయోగించాడని తేలింది. ఈ విచారణలో బాలుడిపై గతంలో రాజస్థాన్ లో బైక్ దొంగతనం కేసు ఉందని తేలింది. ఇలా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మనుషుల అక్రమ రవాణాపై చాలా కఠినంగా ఉంటూ.. బాధితుల ఆచూకీతో పాటు నిందితుల స్థావరాలను గుర్తిస్తుంది.