నేరేడ్మెట్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వంలో సామాన్యులపై డిజిటల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలను అడ్డుకునేలా ‘సైబర్ యోధ’ బృందం ప్రభావాత్మకంగా పని చేయడం సంతోషకరమని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజ న్ అన్నారు. నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సైబర్ యోధ సర్టిఫికేషన్ ప్రజంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయే శ్ రంజన్ హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిట ల్ తెలంగాణను ప్రారంభించాయన్నారు. కొవిడ్ వల్ల ఆన్లైన్ చదువులు, వస్తువుల కొనుగోళ్లు, డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయని అన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆసరాగా చేసుకుని అనేక నేరాలకు పాల్పడుతున్నారని, అంతే కాకుండా ప్రస్తుతం, దేశ వ్యాప్తంగా కేవైసీ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘పోలీస్, సైబర్ యోధ’ లాం టి వారు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, సైబర్ యోధ కార్యక్రమం లాక్డౌన్కు 100 మం దితో ప్రారంభించామన్నారు. 21 మంది విద్యార్థులు, 30 మంది ఐటీ ఉద్యోగు లు, ఆరుగురు రిటైర్డ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని చెప్పారు. అనంతరం, సైబర్ యోధాలో ఉత్సాహంగా పనిచేసిన పలువురికి జయేశ్ రంజన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి, డీసీపీలు, ఎండ్ నౌ ఫౌండేషన్ చైర్మన్ అనిల్ రాచమల్ల పాల్గొన్నారు.