ఇష్టానుసారంగా పోటీపడి వేలంపాడిన గుత్తేదార్లు
చీటీపై గతంకంటే మూడువందలు అదనంగా వసూలు
నిబంధనలు గాలికి వదిలిన గుత్తేదార్
పట్టించుకోని అధికారులు
కోస్గి, ఏప్రిల్ 4: కోస్గి ఎద్దులబజార్లో గుత్తేదార్ల చేతివాటం రైతులకు శాపంగామారింది. ఆదివారం కోస్గి సంతలో ఈఏడాది ఎద్దులబజార్ వేలంలో దక్కించుకున్న గుత్తేదార్ గతంకంటే రెండునుంచి మూడు వందలు అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూటికి రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేసిన ఆవు, మేక, ఎద్దు, గేదెలకు వసూలుచేయాలి, అనగా ఐదువేలకు ఆవును కొనుగోలుచేస్తే 100 రూపాయలు మార్కెట్రుసుము చీటీ చేసుకోవాల్సి ఉంటుంది. కాని నిబంధనలకు విరుద్ధ్దంగా ఒక పశువుకు ఒక్కో రైతు ఒక్కో చీటీకి వద్ద రూ.1200 నుంచి రూ.1300 వసూలు చేస్తున్నారు. గతంలో వేలం పాడే సమయంలో ఎంతవసూలు చేయాలని మున్సిపల్ అధికారులు నియమ నిబంధనలకు కట్టుబడి వసూలు చేయాలని ఒక కరపత్రాన్ని సైతం విడుదలచేశారు. కానీ గుత్తేదార్లు పోటీపడి తమ పంతం నెగ్గించుకునేందుకు రూ. 97 లక్షలు పాడి రైతుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
సంతలో ఎంత వసూలు చేస్తున్నారు. నిబంధనలకు లోబడి వసూలు చేస్తున్నారా లేదా పర్యవేక్షించాల్సిన అధికారులు తమ బాధ్యత మరచి తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ తతంగం చూస్తుంటే మున్సిపల్ అధికారులు, గుత్తేదార్లు కుమ్మక్కయ్యారా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదేవిషయమై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామిని వివరణ కోరేందుకు ఫోన్చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.