దేశంలో కరోనా ఉగ్రరూపం..
ఇప్పటివరకు ఇదే గరిష్ఠం
కొవిడ్తో 478 మంది మృతి
ఎల్లుండి సీఎంలతో ప్రధాని సమీక్ష
మహారాష్ట్రలో షిర్డీ ఆలయం మూత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతున్నది. ఒక్కరోజులోనే 1,03,558 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. గతేడాది సెప్టెంబర్ 17న గరిష్ఠంగా 97,894 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఈ రికార్డు బద్దలై.. ఒక్కరోజులో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కి చేరింది. కొత్తగా 478 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,65,101కి పెరిగింది. గతేడాది రోజువారి కేసులు 20వేల నుంచి అప్పటి గరిష్ఠ స్థాయికి(97,894) చేరడానికి 76 రోజులు పట్టగా, ప్రస్తుతం 25 రోజుల్లోనే లక్షకి చేరాయంటే వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించేందుకు ప్రధాని మోదీ గురువారం అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలోని మొత్తం కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్రంలో 57వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ర్టాలు ఆంక్షలను విధిస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ విధించారు. పలు రాష్ర్టాల్లో బడులు మూతపడ్డాయి. కొవిడ్ టీకాపై ప్రస్తుతం ఉన్న వయోపరిమితి ఎత్తివేయాలని, అందరికీ టీకా వేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీని కోరారు. మరోవైపు, కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య నిపుణులతో కూడిన 50 బృందాలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్లోని 50 జిల్లాల్లో వైరస్ పరిస్థితులను ఈ బృందాలు పర్యవేక్షించనున్నాయి.
షిర్డీ ఆలయం మూసివేత
కరోనా ఉద్ధృతితో షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని సోమవారం రాత్రి మూసివేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఆలయం మూసి ఉంటుందని పేర్కొన్నారు. భక్తులకు దర్శనం లేకపోయినా ఆలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. దేశంలో థర్డ్వేవ్ వచ్చే అవకాశాన్ని కొట్టివేయలేమని, అది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే అన్నారు.
వ్యాక్సినేషన్ వేగం పెంచకుండా ఎగుమతులా?: ఆప్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయకుండా టీకా డోసులను ఇతర దేశాలకు పంపడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ఆప్ ప్రశ్నించింది. కరోనా విజృంభణతో బంగ్లాదేశ్ ప్రభుత్వం వారంపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట