సాధారణ ప్రజలకు సెలవొస్తే.. సైబర్నేరగాళ్లు బిజీగా ఉంటున్నారు. అమాయక ప్రజలపై పంజావిసురుతూ పండుగ చేసుకుంటున్నారు. సెలవు రోజున బ్యాంకులు పనిచేయకపోవడంతో నేరగాళ్లకు సమయం కలిసి వస్తుంది. దీంతో పనిదినాల్లో జరిగే నేరాల కంటే సెలవు రోజుల్లో జరిగే సైబర్నేరాలు ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అదే రోజు ఎక్కువ మంది మోసపోతున్నారు. శనివారం సాయంత్రం నుంచే సైబర్నేరగాళ్లు అమాయకులకు వివిధ రకాలుగా ఫోన్లు చేస్తున్నారు. సోమవారం వచ్చే వరకు రోజు వారి కంటే రెట్టింపు సంఖ్యలో బాధితులు సైబర్ ఠాణాను ఆశ్రయిస్తున్నారు.
తాము బ్యాంకు అధికారులమంటూ, ఓఎల్ఎక్స్లో వస్తువులను క్రయ విక్రయాలకు పెట్టి, క్యూఆర్ కోడ్తో తికమక పెడుతూ.. ఇలా డబ్బులు లాగేయడం వంటి నేరాలు జరుగుతున్నాయి. ఆదివారం, పండుగలు, తదితర సెలవుల సందర్భంగా సైబర్నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అయితే ఆ సమయంలో బాధితులకు అనుమానం వచ్చి ఆదివారం, పండుగ రోజు కూడా మీ బ్యాంకు పనిచేస్తుందా అంటూ ప్రశ్నిస్తారు. మా ఖాతాదారులకు సంబంధించిన డెబిట్ కార్డులన్నింటిని క్రమబద్ధీకరిస్తున్నామంటూ నమ్మిస్తున్నారు. చాలా కార్డుల గడువు పూర్తికావడంతో వాటిని ఆధార్కు లింక్ చేస్తున్నామని, అందుకే సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సి వస్తుందంటూ సైబర్నేరగాళ్లు బాధితులను బుట్టలో పడేస్తున్నారు. ఖాతా, ఏటీఎం వివరాలతో పాటు ఓటీపీ కూడా చెప్పేస్తున్నారు. వీటితో సైబర్నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులను కాజేస్తున్నారు.
అయితే డబ్బు తమ ఖాతాలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డ్రా చేశారనే సమాచారం ఫోన్ ద్వారా తెలుసుకునే బాధితులు మొదటగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తారు. దీంతో పాటు పోలీస్స్టేషన్కు కూడా వెళ్తారు. కాని పోలీసులు కూడా బ్యాంకు నుంచే సమాచారం తెప్పించుకోవాల్సి వస్తుంది. అయితే సైబర్ నేరగాడు మోసపూరితంగా బాధితుల బ్యాంకు నుంచి కాజేసిన డబ్బు ఏ ఖాతాలోకి వెళ్లిందనే విషయం వెంటనే తెలిసే అవకాశముండదు. ఇలా కొన్ని గంటల సమయం సైబర్నేరగాడికి కలిసి వస్తుండటంతో బాధితుడి ఖాతా నుంచి మరో వ్యాలెట్లోకి.. అక్కడి నుంచి ఇంకో ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసుకునేందుకు తగిన సమయం చిక్కుతుందని సైబర్నేరగాళ్లు సెలవు రోజుల్లోనే ఎక్కువ మందిని టార్గెట్ చేస్తున్నారు.