Cyber crime | పాత వస్తువులను అమ్మకానికి పెడుతున్నారా? ఉద్యోగమనగానే ఎగిరి గంతేస్తున్నారా? ఇంట్లోనే ఉండి సంపాదనకు అవకాశమిస్తామంటే సంబురపడిపోతున్నారా? పెట్టుబడులు పెట్టి రెట్టింపు లాభాలకు ఆశపడుతున్నారా? క్యూఆర్ కోడ్ పంపితే వెనుకా ముందూ ఆలోచన చేయకుండా స్కాన్ చేస్తున్నారా? అయితే ఇక మీరు నిండా మునగడం ఖాయం. ఇలాంటి సందేశాలకు వచ్చిన ప్రతిస్పందనలను తమ అవకాశాలుగా వినియోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్కొక్కరి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైం పోలీసులు నగరవాసులను అప్రమత్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి మోసగాళ్ల చేతిలో చిక్కొద్దని సూచిస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. పలు దేశాల పోలీసులు, దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ మేరకు అమెరికా ఎఫ్బీఐ ఉన్నతాధికారులతో సీబీఐ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని సైబర్ నేరాల తీరుతెన్నులు, ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీకి సంబంధించిన విషయాలపై కూలంకశంగా చర్చించారు. భవిష్యత్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని పటిష్ట వ్యవస్థను నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు.
పండుగ సీజన్ను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు సైబర్ నేరస్తులు ‘ఆన్లైన్’లో కాచుకొని కూర్చున్నారు. దసరా, దీపావళిని వేదికగా మార్చుకొని ఓఎల్ఎక్స్లో తిష్ట వేశారు. అందులోని ప్రకటనలపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. పాత వస్తువులు కొంటామంటూ… డబ్బులు చెల్లించేందుకు క్యూ ఆర్ కోడ్లు పంపించి..లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పండుగల సందర్భంగా ఆన్లైన్ ద్వారా తమ పాత వస్తువులు అమ్మేసి కొత్తవి కొనేందుకు సిద్ధమవుతున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
“ఇన్కం ట్యాక్స్, రెవెన్యూ విభాగాల నుంచి మాట్లాడుతున్నాం. మీరు సరిగా పన్ను చెల్లించలేదు. వెంటనే చెల్లించకపోతే పెనాల్టీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.” అని సికింద్రాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశస్తులను భయబ్రాంతులకు గురి చేశారు. వెంటనే వారు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించగా పౌండ్ల రూపంలో కాకుండా క్రిప్టో కరెన్సీ రూపంలో లంచాలు చెల్లించారు. ఇంకొందరు ఈ ఫోన్లపై అనుమానం చెంది ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఫిర్యాదు చేయగా ఈ మోసం బయటపడింది. ఈ సమాచారం హైదరాబాద్ పోలీసులకు అందడంతో దర్యాప్తు ప్రారంభించాయి. ఈ తరహా మోసం మార్చిలో విడుదలైన ‘మోసగాళ్లు’ సినిమాను తలపించడం గమనార్హం.
సనత్నగర్కు చెందిన ఓ డిజైనర్ దసరా పండగ కంటే ముందు తన ఇంట్లో ఉన్న సింగిల్ డోర్ పాత ఫ్రిడ్జిని రూ.8 వేలకు అమ్ముతున్నట్లు ఓఎల్ఎక్స్లో ఫోన్ నంబర్తో ప్రకటన పెట్టాడు. యాడ్ పోస్ట్ చేసిన మూడు గంటలకే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీ ఫ్రిడ్జిని నేను కొంటాను’అని చెప్పాడు. పూర్తి నగదును చెల్లిస్తాను.. ఆ తర్వాత చిరునామా పంపిస్తానని నమ్మించాడు. అయితే ముందుగా ఓ క్యూ ఆర్ కోడ్ పంపిస్తానని.. స్కాన్ చేసి రూ.20 పంపండి అని సూచించాడు. అలా చేయగానే మొత్తం రూ. 7 లక్షలు బాధితుడి ఖాతా నుంచి కాజేశాడు. మోసపోయానని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓల్డ్అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు బ్యాంక్ ఉన్నతాధికారిని తన ఇంట్లోని టేక్ వుడ్ సోఫాను విక్రయించాలని దసరా పండగకు ముందు రోజు ఓఎల్ఎక్స్ ప్రకటన పెట్టి.. ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆగంతకుడు ఫోన్ చేసి ‘మీ సోఫాను కొనుగోలు చేస్తాన’న్నాడు. ధరను మాట్లాడుకొని.. పేమెంట్ కోసం క్యూ ఆర్ కోడ్ పంపాడు. స్కానింగ్తో గందరగోళాన్ని సృష్టించి..ఆ ఉన్నతాధికారిని నుంచి మొత్తం రూ. 3.88 లక్షలు కొట్టేశాడు.
వాట్సాప్లో వచ్చిన బిజినెస్ ఆఫర్కు స్పందించిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు రూ. 46 లక్షలు టోకరా వేశారు. కౌకూర్కు చెందిన వ్యాపారికి వాట్సాప్లో ఓ మెసేజ్, ఈ-మెయిల్ ఐడీ వచ్చింది. అందులో వివరాల పరిశీలించగా, ఓ అయుర్వేదిక్ అయిల్ను కొనుగోలు చేసేందుకు యూకేలోని బార్నెస్ ల్యాబోరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆయిల్ నాగ్పూర్లోని ఓ సంస్థ దగ్గర ఉంది. ఆ సంస్థ నుంచి ఆయిల్ కొని మాకు సరఫరా చేయండని మెయిల్లో వివరించారు. 300 లీటర్లను ‘బార్నెస్’ సంస్థ ఖరీదు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సదరు వ్యాపారి ఆయిల్ను కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా వారి మాటలు నమ్మి మొత్తం రూ. 46 లక్షలు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత వారు ఫోన్లు ఎత్తకపోవడం, మెయిల్స్కు స్పందించకపోవడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘ఢిల్లీ సీఎం అనుమతి కోసం మీరు చార్జీలు చెల్లిస్తే మీకు రూ. 25 లక్షల లాటరీ నగదు జమవుతుంద’న్న మాటలను నమ్మిన ఓ ప్రైవేటు ఉద్యోగి రూ. 15 లక్షలను పోగొట్టుకున్నాడు. ఈ డబ్బంతా ఐదు రోజుల్లో సైబర్ మోసగాళ్ల ఖాతాల్లో జమ చేశాడు. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం..చందానగర్ ప్రశాంత్నగర్కు చెందిన ఓ వ్యక్తి బీటెక్ పూర్తి చేసి ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తున్నాడు. అతడికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘మీ ఫోన్ నంబర్ కేబీసీ లాటరీలో రూ. 25 లక్షల నగదు బహుమతి గెల్చుకుంది. నిజమేనని నమ్మిన బాధితుడు.. వెంటనే అవతలి వ్యకులకు ఫోన్ చేశాడు.
మేము సూచించిన పత్రాలను పంపాలని వాట్సాప్ కాల్లో చెప్పారు. అలా అన్ని వివరాలను పంపిన తర్వాత వారు ‘మీ లాటరీ డబ్బు ఖాతాలో జమ అయ్యేందుకు న్యూ ఢిల్లీ సీఎం అనుమతి కావాలి.. ఇందుకోసం చార్జీలు చెల్లించాల’ని చెప్పి జీఎస్టీ, సీబీ, ఎన్ఓసీ, ఎల్ఐసీ పాలసీ ఇలా అనేక అంశాలు చెప్పి వాటికి డబ్బులు చెల్లిస్తే మీ లాటరీ డబ్బు మీ అకౌంట్లో పడుతుందని చెప్పారు. వీటన్నింటికి ఓకే అన్న బాధితుడు.. సుమారు రూ.15 లక్షలను వారు సూచించిన ఖాతాల్లో జమ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండడంతో మోసమని గుర్తించి..సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
అమెరికా ఎఫ్బీఐతో సమన్వయం సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పలు దేశాల పోలీసులు, దర్యాప్తు సంస్థలతో సమన్వయం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా ఎఫ్బీఐ ఉన్నతాధికారులతో సీబీఐ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. తాజాగా చోటు చేసుకుంటున్న సైబర్నేరాలు వాటి తీరు తెన్నులను, ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలకు సంబంధించిన విషయాలను చర్చించారు.
చాలా వరకు నేరగాళ్లు ఉపయోగిస్తున్న వ్యాలెట్లు, డాటా స్టోరేజీకి సంబంధించిన ప్రధాన సర్వర్లు ఇతర దేశాల్లోనే ఉంటున్నాయని, నేరం జరిగినప్పుడు సమాచారం త్వరగా రావడం లేదనే విషయాన్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సైబర్క్రైమ్ను అరికట్టేందుకు భారత్, అమెరికాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్లాలని వర్చువల్ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. వర్చువల్ సమావేశంలో ఇంటర్పోల్, ఎఫ్బీఐ అధికారులతో పాటు తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల సైబర్ వింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా కాల్సెంటర్ మోసాలు, స్పూఫింగ్ మెయిల్స్, ఆర్థిక పరమైన నష్టాలు జరిగే సైబర్నేరాల గురించి చర్చ జరిగింది.
ఎవరైనా క్యూ ఆర్ కోడ్ పంపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి. అతడు డబ్బులు చెల్లించానని మనకు క్యూఆర్ కోడ్ పంపినప్పుడు అది మనకు రిసీవ్డ్ అని రావాలి. కానీ చాలా మంది అది గమనించకుండానే కోడ్ను క్లిక్ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్లో పే అని పెట్టి పంపిస్తారు. దీంతో మనం దానిని క్లిక్ చేయగానే మన ఖాతా నుంచి డబ్బు వెళ్లిపోతుంది. ఇది గమనించుకోవాలి. అలాగే ఏదైనా డెలివరీలో ఆలస్యమైనా…లేదా తప్పుడు వస్తువు వచ్చిందని.. తిరిగి వాపసు ఇచ్చేందుకు ఇంకా ఏదైనా కారణాలతో గూగుల్ సెర్చ్లో కస్టమర్ కేర్ నంబర్లను కోసం వెతికి సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కొద్దు. నేరుగా సంబంధిత వెబ్సైట్లలో లావాదేవిలు జరుపాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అత్త చీర కొంటే.. కోడలు ఖాతా ఖాళీ
Lottery Scam | లాటరీ తగిలిందంటూ యువతికి కుచ్చుటోపి
నా ఇన్కం రోజుకు 20 వేలు!.. మమ్మల్ని పట్టుకోగలరా?.. పోలీసులకు ఓ సైబర్ నేరగాడి సవాల్
‘అశ్లీల సంభాషణల్లో’ మునిగి 15 లక్షలు సమర్పించుకున్నాడు..