బంజారాహిల్స్,సెప్టెంబర్ 19: ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే..సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి.. డబ్బులు పోగొట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 2లో నివాసముంటున్న బి.రవి అనే వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తుంటాడు. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఇటీవల పిల్లలకు తన ఫోన్ ఇచ్చాడు. వారంరోజుల తర్వాత ఫోన్ను పరిశీలించగా, తన గూగుల్ పే అకౌంట్లోంచి పలు సందర్భాల్లో రూ.29,739 మాయమైనట్లు గుర్తించాడు. ఆరా తీయగా తమకు ఏవో ఆన్లైన్ గేమ్స్ గురించి నోటిఫికేషన్లు వచ్చాయని, వాటిని యాక్సెప్ట్ చేశామని పిల్లలు తెలిపారు. దీంతో బ్యాంకును సంప్రదించగా, ఆన్లైన్ గేమ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసినట్లు తేలింది. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.