జూబ్లీహిల్స్కు చెందిన ఓ యువకుడు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ యువకుడికి ఇంజినీరింగ్ చదివే సమయంలో ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తి పేరుతో ఈ మెయిల్ వచ్చింది. తనకు అర్జెంట్గా రూ.5 వేల విలువైన గిఫ్ట్ కూపన్లు కావాలని కోరగా.. తనకు చదువు చెప్పిన గురువే ఈ మెయిల్ చేశాడని భావించిన ఆ యువకుడు ముందు వెనుకా ఆలోచించకుండా అమెజాన్లో కూపన్లు కొని పంపాడు. మొత్తం రూ.3.35 లక్షల విలువైన 65 కూపన్లు పంపించగా క్యాష్ చేసుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా మరికొన్ని కావాలని అడుగగా అనుమానం వచ్చిన యువకుడు ప్రొఫెసర్కు ఫోన్ చేశాడు. తాను అలాంటి ఈ మెయిల్స్ పంపలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించి మంగళవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోన్ కోసం ఆన్లైన్లో వెతికిన ఓ యువకుడు సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 86,850 పోగొట్టుకున్నాడు. ఆన్లైన్లో లభించిన ఓ నెంబర్కు ఫోన్ చేయడంతో తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని, మీ ధ్రువపత్రాలు పంపించాలంటూ సూచించారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ పేరుతో దఫదఫాలుగా రూ.86,850 వసూలు చేశారు.
హైదరాబాద్ బేగంపేట్కు చెందిన ఏపీప్లస్ సంస్థ అయిల్ అండ్ సర్వీసెస్కు చెందిన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 70 శాఖలున్నాయి. అయితే కత్తార్లోని ఈ కంపెనీ సంస్థలలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించిన సైబర్నేరగాళ్లు కంపెనీకి సంబంధించిన నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి అపాయింట్మెంట్ లేఖలు పంపించారు. దీంతో బాధితులు కత్తార్లోని సంస్థకు ఫోన్ చేశారు. తమకు అందిన అపాయింట్మెంట్ లేఖలపై ఆరా తీశారు. దీంతో ఆ సంస్థ తాము ఎవరిని ఉద్యోగంలోకి తీసుకోలేదని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ హైదరాబాద్లోని సంస్థ కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. హైదరాబాద్లోని సంస్థ ప్రతినిధులు బాధితులతో మాట్లాడారు. నలుగురు హైదరాబాద్కు చెందిన బాధితులకు నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు అందినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 13,500 వసూలు చేశారు. ఇంకా రూ. 35 వేలు అడుగుతున్నారంటూ బాధితులు సంస్థ ప్రతినిధులకు చెప్పడంతో హైదరాబాద్లోని సంస్థ ప్రతినిధులు మంగళవారం సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తన ఫొటోలతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీలు రూపొందించి అసభ్యకరమైన మెసేజ్లు పోస్టు చేస్తున్నారంటూ నల్లకుంటకు చెందిన ఓ యువతి మంగళవారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.