సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అడ్డుకోవడం, నేరం చేసిన వారిని పట్టుకోవడం, బాధితులు ఆర్థికంగా నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, కేసుల దర్యాప్తులో సమన్వయం.. వంటి అంశాలపై మంగళవారం సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సాధారణ నేరాలు తగ్గుతూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.. నేరగాళ్లు ఎక్కడో ఉండి, నేరాలు చేస్తున్నారు.. అంతా డిజిటల్ యుగం కావడంతో సైబర్ నేరాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, సజ్జనార్తోపాటు నార్త్, వెస్ట్జోన్ ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, సీఐ సెల్ ఐజీ రాజేశ్ కుమార్, వరంగల్ సీపీ తరుణ్ జోషి, సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్ నియంత్రణ, నేరం జరిగిన సమయంలో బాధితులకు ఎలాంటి సహకారం అందించాలనే అంశాలపై చర్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ సైబర్క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 155260ను పటిష్టంగా అమలు చేయడం వల్ల, బాధితులు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడేందుకు అవకాశం ఉంటుందని చర్చించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే ఆ నంబర్కు ఫోన్ చేస్తే, వివరాలు తీసుకొని, నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో పడ్డ డబ్బును ఫ్రీజ్ చేసేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. ఇది 24 గంటల్లో బాధితులు ఫోన్ చేస్తే నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే ఇతర రాష్ర్టాల్లో నేరగాళ్లను పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో రాష్ట్ర స్థాయిలోని పోలీసులు సమన్వయంతో వెళ్లాలని, ఇతర రాష్ర్టాలకు కేసుల దర్యాప్తుపై వెళ్లే బృందాలకు కావాల్సిన సహకారం ఇవ్వాలని చర్చించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో సైబర్ నేరాలు వాటి దర్యాప్తుల తీరు, జిల్లాలో సైబర్ పోలీసు స్టేషన్లకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో లోన్ యాప్ కేసుల్లో నేరగాళ్ల బ్యాంకు ఖాతాలు తెలుసుకున్న విధానంపై కూడా చర్చించారు. మొదటి సమావేశం డీజీపీ నేతృత్వంలో సైబరాబాద్లో జరిగింది. మంగళవారం రెండో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారుల అభిప్రాయలతో ఒక నివేదికను తయారు చేస్తున్నారు.