సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): నైజీరియన్ సైబర్ నేరగాళ్లు దోపిడీలకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాకింగ్ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల్లోనే ఖాతాలు తెరిపిస్తున్నారు. హ్యాకింగ్తో సర్వర్ను తమ చేతిలోకి తీసుకుంటున్న నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును వారు ఓపెన్ చేయించిన ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఖాతాలు ఓపెన్ చేయడంలో సహకరించిన వారికి పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తున్నారు.
నేరగాళ్లు టార్గెట్ చేసిన ప్రాంతంలోనే కొన్నాళ్లు ఉంటూ ఆయా బ్యాంకుల్లో తమకు తెలిసిన వారితో ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ గ్యాంగులు స్థానికుల సహాయం కూడా తీసుకుంటూ.. వారితోనే కొత్త ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారు. ఇటీవల తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రూ.1.96కోట్లు కాజేసిన విషయం తెలిసిందే.
తొలుత హైదరాబాద్లో బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసేందుకు ప్లాన్ వేసిన నైజీరియన్ సైబర్ నేరగాళ్ల ముఠా.. ఆ తరువాత ఆయా బ్యాంకుల్లోనే ఖాతాలు తెరిపించింది. ఈనెల 2న సుప్రియ ఎల్జిబెత్ అనే మహిళ పేరుతో టెస్కాబ్ బ్యాంకు సికింద్రాబాద్ శాఖలో ఖాతా తెరిచారు. అలాగే, చందానగర్ బ్యాంకు శాఖలో రఫీ, యాసిన్ పాషాతో ఖాతాలు తెరిపించారు. వీరిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో ఖాతాలు తెరిపించిన నైజీరియన్ (టోలీచౌకీ నుంచి) పరారీలో ఉన్నాడు. అతడితో సంబంధమున్న మరో నైజీరియన్ డైలాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, సుప్రియ సైబర్ ముఠాతో కలిసి పనిచేస్తూ ఇతర రాష్ర్టాల్లోనూ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. సుప్రియ కొంతకాలం పద్మారావునగర్లో ఉన్న చిరునామాను వెతుకుంటూ ఇతర రాష్ర్టాల పోలీసులు కూడా హైదరాబాద్కు వచ్చిపోయినట్లు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు.