సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): విమానం రద్దు అయ్యింది. టిక్కెట్ పైసలు వెనక్కి రాలేదు. గూగుల్ సెర్చ్ చేస్తే ఖాతాలోని రూ. 4 లక్షలు పోయాయి. బాధితుడి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైం పీఎస్లో కేసు నమోదైంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి విహార యాత్రకు జైపూర్ వెళ్లేందుకు ఓ విహార యాత్ర ప్రయాణానికి సంబంధించిన యాప్ ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. అయితే, ఆ విమానం రద్దయ్యింది. దీంతో బుక్ చేసుకున్న టిక్కెట్ డబ్బులు వెనక్కి రావాల్సి ఉంది. డబ్బు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగి గూగుల్ సెర్చ్లో విహార యాత్ర యాప్కు చెందిన సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ నంబరు కోసం వెతికాడు. అందులో దొరికిన ఓ నంబరుకు ఫోన్ చేయడంతో వారు ఎలాగైనా టిక్కెట్ డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మించారు. క్విక్ సపోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకోమని సూచించారు. ఆ తర్వాత వచ్చిన ఐడీని తెలుసుకుని వారు ప్రభుత్వ ఉద్యోగి యూపీఐ పిన్, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి మొత్తం రూ.4 లక్షలు కొట్టేశారు.