చాలా మంది మహిళలు వారు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడతామనే ఆశతో నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోతున్నారు. బాధితుల అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న నేరగాళ్లు నిండా ముంచేస్తున్నారు. ఇక రికవరీ విషయానికి వస్తే.. అసాధ్యమని చెప్పినా బాధితులు పదే పదే వారి కష్టాలను చెబుతూ పోలీసులను పరేషాన్ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సమయంలో చాలా ఆలోచించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఆన్లైన్ వ్యవహారాలపై పట్టు ఉన్న నిపుణులతో చర్చించాలని, అనుమానం ఉంటే సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
కష్టాలు తీరుతాయన్న ఆశతో సైబర్ క్రిమినల్స్ చెప్పే తియ్యని మాటలు నమ్మి మహిళలు బోల్తా పడుతున్నారు. మ్యాట్రిమోని ప్రొఫైల్స్ను జల్లెడ పడుతున్న సైబర్ నేరగాళ్లు బలహీనతను టార్గెట్ చేస్తున్నారు. తక్కువ పెట్టుబడులతో ఊహించని లాభాలంటూ వచ్చే సైబర్ నేరగాళ్ల ప్రకటనలకు స్పందించే మహిళలను ఇంకా సులభంగా తమ వలలోకి దింపుతున్నారు. నేరగాళ్ల మాటలు నమ్మిన మహిళలు కూడబెట్టుకున్న డబ్బంతా వారి చేతిలో పోస్తున్నారు. ఆ తర్వాత లబోదిబోమంటున్నారు. అయితే, మోసపోయిన ప్రతి బాధిత మహిళ వెనకాల ఓ దీన గాథ ఉందని ఈ కేసులు పరిశీలిస్తున్న అధికారులు చెబుతున్నారు. ఏకంగా లక్షలు పోగొట్టుకొని.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మల్కాజిగిరికి చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం మ్యాట్రిమోని సైట్ ప్రొఫైల్ను నమోదు చేసుకుంది. ఈ ప్రొఫైల్ను విశ్లేషించుకున్న సైబర్ నేరగాడు ఆమెను వాట్సాప్లో పరిచయం చేసుకున్నాడు. కంటి అద్దాల ఫ్రేమ్ను లండన్ నుంచి పంపిస్తున్నానని నమ్మించాడు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులమని, విదేశీ కరెన్సీ అని, ఖరీదైన సామగ్రి ఉన్నదని భయపెట్టించి.. ఆమె ఉద్యోగం చేసి కొన్నేండ్లుగా కూడబెట్టుకున్న రూ.14 లక్షలు ఐదు రోజుల్లో కొట్టేశాడు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ తన దీన పరిస్థితి పోలీసులకు చెప్పుకుంది.
ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుటుంబంలో నెలకొన్న ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పోషణ మరింత భారమైంది. ఎలాగైనా ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కోవాలనే పట్టుదలతో ఆమె ఫోన్కు వచ్చిన ఓ మెసేజ్కు స్పందించింది. తక్కువ పెట్టుబడి.. భారీగా లాభాలంటూ ఆ ఫోన్లో ఉన్న సమాచారాన్ని చూసిన మహిళ.. అందులో ఉన్న ఫోన్ నంబరుకు మాట్లాడింది. నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి రూ. 3 లక్షలు పెట్టుబడిగా ఇచ్చింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ పోయిన తన డబ్బును తిరిగి వచ్చేలా సహాయం చేయాలని సైబర్ క్రైం పోలీసులను ఫోన్లో కోరింది. సార్, ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తా.. సహాయం చేయండి.. అనారోగ్యంతో ఉన్న నా భర్తను వదిలి ఫిర్యాదు చేసేందుకు రాలేను.. అని చెప్పింది. దీంతో పోలీసులు ఆమె ఫిర్యాదును ఆన్లైన్లో స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.