సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ఫిషింగ్ మెయిల్తో ఓ సంస్థకు సైబర్నేరగాళ్లు రూ. 53 లక్షలు టోకరా వేసేందుకు విఫలయత్నం చేశారు.. లండన్లోని బ్యాంకు అధికారుల అప్రమత్తతతో ఆ డబ్బును సైబర్నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆపారు. వివరాల్లోకి వెళ్లితే.. మాసబ్ట్యాంక్లో నిర్మాస్టెర్గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఖాజా ఎంఎం ఖాదర్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా చైనాకు చెందిన షాంఘై సొల్యూషన్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ కంపెనీకి 97,250(సుమారు రూ. 68 లక్షలు) డాలర్ల విలువైన కొనుగోలు ఆర్డర్ను ఇచ్చారు. అందులో 30 శాతం అడ్వాన్స్గా 29,250 డాలర్లు చెల్లించారు. మిగతా బ్యాలెన్స్ కూడా ఖాదర్ చెల్లించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అతని మెయిల్కు ఒక ఈ మెయిల్ వచ్చింది. తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త ఖాతాలోకి డాలర్లు జమచేయండంటూ హెచ్ఎస్బీసీకి సంబంధించిన ఖాతా నంబర్లు పంపించారు. అది నిజమని నమ్మిన ఖాదర్..మిగతా సొమ్మును ఆ ఖాతాలోకి బదిలీ చేసి, సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేశాడు.
మొత్తం డబ్బు పంపించానని త్వరగా ఆర్డర్ పంపించాలంటూ కోరాడు. తమకు డబ్బు అందలేదని, అయినా కూడా ఎలాంటి మెయిల్ మేం పంపించలేదని, షాంఘై సంస్థ సూచించింది. వెంటనే వచ్చిన ఈమెయిల్ను ఖాదర్ ఆరా తీశాడు. షాంఘై సంస్థ ఈమెయిల్ మాదిరిగానే చిన్న మార్పుతో(ఫిషింగ్ మెయిల్) సైబర్నేరగాళ్లు ఈమెయిల్ పంపించినట్లు గుర్తించాడు. సైబర్నేరగాళ్లు పంపించిన బ్యాంకు అడ్రస్లను పరిశీలించగా అవి లండన్లో ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆ బ్యాంకు అధికారులకు జరిగిన విషయం వివరించాడు. అప్పటికే సదరు బ్యాంకు అధికారులు ఆ ఖాతాలపై అనుమానంలో ఉన్నారు. ఖాదర్ కూడా ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో ఆ ఖాతాలోకి బదిలీ అయిన రూ. 53 లక్షలు సైబర్నేరగాళ్లు డ్రా చేయకుండా కట్టడి చేశారు. జరిగిన విషయాన్ని సైబర్క్రైమ్ పోలీసులకు వివరిస్తూ గురువారం బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.