సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ) : మణ్ణపురం గోల్డ్ సంస్థ ఇంటి వద్దకే గోల్డ్ లోన్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన స్కీమ్ను..సైబర్నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని.. ఆ సంస్థకు రూ. 30 లక్షలు టోకరా వేశారు.
నగరంలోని మణ్ణపురం గోల్డ్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి సైబర్నేరగాళ్లు ఫోన్ చేశారు. మేం హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ వద్ద ఉన్న సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు, మీ ఎంప్లాయి ఐడీ, పాస్వర్డ్లు చెప్పండంటూ వివరాలు తీసుకున్నారు. హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్లపై సర్వేలెన్స్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఉద్యోగులిద్దరు ఆ వివరాలను అందజేశారు. అప్పటికే మణ్ణపురం గోల్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న సైబర్నేరగాళ్లు, ఆ ఇద్దరు ఉద్యోగులు బంగారం తనిఖీ చేసి వెళ్లినట్లు ఆన్లైన్లో రిపోర్టులు రాసుకున్నారు. రాసిన వాటిని హెడ్ ఆఫీస్కు పంపించారు. తాము 1200 గ్రాముల బంగారాన్ని రిసీవ్ చేసుకున్నామని, రూ. 30 లక్షల రుణం మంజూరు చేయాలంటూ ఆన్లైన్లో రిపోర్టు చేశారు.
దీనిని పరిశీలించిన కేంద్ర కార్యాలయంలోని ఉద్యోగులు సూచించిన బ్యాంకు ఖాతాలోకి రూ. 30 లక్షలు ఈ నెల 22న జమ చేశారు. మరుసటి రోజు బ్యాంకులో బంగారం ఎంత ఉందనే విషయంపై అధికారులు ఆరా తీశారు. లెక్కల్లో 1200 గ్రాముల బంగారం రిసీవ్ చేసుకున్నట్లుంది. ప్రత్యక్షంగా కన్పించడం లేదని అనుమాన పడ్డారు. అన్ని ఖాతాలను, రుణం పొందిన వారి వివరాలు పరిశీలించడంతో 1200 గ్రాముల బంగా రం కన్పించలేదు. ఎవరిచ్చారని ఐడీలను పరిశీలిస్తే సదరు ఉద్యోగులు మాత్రం తమకు ఏమి తెలియదని, తాము ఎవరి వద్దకు వెళ్లలేదని చెప్పారు. అయితే తమకు రెండు రోజుల క్రితం హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామం టూ ఫోన్ చేసి తమ ఐడీ వివరాలు తీసుకున్నారని ఇద్దరు ఉద్యోగులు చెప్పారు. ఇదంతా మోసమని గుర్తించి గురువారం మణ్ణపురం గోల్డ్ సంస్థ ప్రతినిధులు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.