సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కరోనాతో ఉపాధి కోల్పోయి కొందరు..ఆదాయం అంతంతే ఉన్నవారు ఇంకొందరు.. తమ ఆదాయం పెంచుకునేందుకు పడుతున్న తపన వారిని నట్టేట ముంచేలా చేస్తున్నది. ఆదాయం కోసం ఎవరిని అడగాలో తెలియక..అడిగితే ఏమనుకుంటారోనని గూగుల్లో శోధిస్తూ సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. అప్పటికే ఆకర్షించే ప్రకటనలు పెట్టి భారీ ఆదాయమంటూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు వందలాదిమంది ఇలా ఇంటర్నెట్లో శోధిస్తూ నష్టపోతున్నారని సైబర్ క్రైం పోలీసు, సైబర్ నిఫుణులు, సైబర్ విశ్లేషకులు గుర్తించారు. ప్రధానంగా రెండో ఆదాయ మార్గాలను వెతుకుతున్నారని తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఆకట్టుకునే ప్రకటనలు చూపించి నిండా ముంచుతున్నారు.
హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కరోనా సమయంలో తన ఆదాయం తగ్గింది. కుటుంబ పోషణ భారంగా మారింది. వెంటనే గూగుల్ సెర్చ్ను రోజువారి ఆదాయాన్ని చూపించమని అడిగాడు. వెంటనే గూగుల్ కొన్ని పెట్టుబడి ప్రకటనలు చూపించింది. వాటిలోని నంబర్లను సంప్రదించగానే సైబర్ నేరగాళ్లు రోజకు రూ.2 వేలు, ఇంకా ఆపైనే సంపాదించొచ్చని రెచ్చగొట్టారు. నిజమేనని నమ్మి గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, ఇతర వాటికి ఓకేలు చెప్పాడు. ముందుగా కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టించి దానికి కొంత స్వల్ప ఆదాయమంటూ కొంత డబ్బును డిపాజిట్ చేశారు. ఆ తర్వాత పెట్టుబడిని పెంచమన్నారు. వెంటనే స్పందించి రూ.2 లక్షల నుంచి దాదాపు రూ.11 లక్షల వరకు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత మాట్లాడిన వ్యక్తి ఫోన్ బంద్ అయ్యింది.
లాక్డౌన్ కాలంలో ఇంటర్నెట్లో శోధిస్తున్నారని ఇటీవల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో వారు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టి లక్షల్లో డబ్బు పోగొట్టుకుని ఆర్థికంగా మరింత కుంగిపోతున్నారు. ఇలా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు పోలీసులను మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి.
నగరానికి చెందిన ఓ ఉద్యోగికి కరోనా పరిస్థితులతో వచ్చే జీతంలో కోత పడింది. ఉద్యోగం వదులుకోలేక, ఆదాయం చాలక తీవ్ర సతమతమవుతున్నాడు. ఆన్లైన్ ద్వారా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి భారీగా డబ్బులు సంపాదిద్దామని ప్లాన్ చేసుకొని గూగుల్ను అడిగాడు. అందులో ఓ ప్రకటన చూశాడు. రోజుకు 2000 నుంచి 8000 వేల రూపాయలు సంపాదించవచ్చని చూశాడు. వెంటనే ఆ ప్రకటనలోని లింక్ను క్లిక్ చేసి అందులో వివరించినట్లు 100, 500, 1000 రూపాయల వరకు సామాన్లు కొనుగోలు చేయగా, అతడి ఖాతాలో 458 రూపాయలు జమ అయ్యాయి. ఆ తర్వాత వారు పెట్టుబడిని పెంచమని చెప్పి పలు దఫాల్లో రూ.2.20 లక్షలను డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత సంప్రదిస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఇలాంటి మోసాలపై ఇటీవల రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందగా, సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ వేగవంతం చేశారు.