కరోనా కాలంలో సైబర్నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నెటిజన్ల అవసరాలను ముందే పసిగడుతూ బోల్తా కొట్టిస్తున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో చాలామంది యూపీఐ, ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సమాచారం రాకపోతే కంగారు పడి వెంటనే కస్టమర్ కేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఫేక్ కస్టమర్ ఫోన్ నంబర్లను గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మొదటి ప్రాధాన్యతలో పెట్టుకుంటున్నారు.
వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేయగానే గుర్తించి వెంటనే వారికి ఫోన్ చేసి మాటలు కలిపి మాయలో పడేస్తున్నారు. రిమోట్ యాప్లను డౌన్లోడ్ చేయించి లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ తరహా కేసులపై అనేక ఫిర్యాదులు వస్తుండటంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆన్లైన్ సేవలను అధికంగా వాడే వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. కరోనా ఉధృ తి నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు, మాస్కుల పేరు చెప్పి దోచుకుంటున్నారు. అంతేకాక ఉద్యో గం, పెండ్లి పేరుతోనూ చీటింగ్ చేశారు. మొత్తంగా ఈ నెల రోజు వ్యవధిలో సుమారు రూ.2.05 కోట్లను కొల్లగొట్టారు.
కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే సైబర్నేరగాళ్లు మాత్రం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు నగదు ఎవరికి వేస్తున్నాం.. ఏ ఖాతాలో డిపాజిట్ చేస్తున్నామో పరిశీలించాలి. కొందరు వినియోగదారులు ఆ విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. ఫోన్లలో అవతలి వారు చెబుతున్న విషయాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. వారు సూచించిన ఖాతాలకు నగదు జమ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాశ కూడా కొంప ముంచుతుంది. అవగాహన, అప్రమత్తతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. – ఏసీపీ, కేవీఎం ప్రసాద్
బాలానగర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన స్నేహితుడికి ఫోన్ పే ద్వారా రూ.2,800 పంపాడు. అయితే ఈ చెల్లింపునకు సంబంధించిన సమాచారం అతడికి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే గూగుల్లో ఫోన్ పే కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ సెర్చ్ చేశాడు. అందులో దొరికిన నంబరుకు ఫోన్ చేయగా చెల్లింపులకు సంబంధించిన సమాచారం రాకపోతే నగదు వెనక్కి వస్తుందని చెప్పిన అవతలి వ్యక్తి ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేయించాడు. ఓ రూపాయి పంపమని చెప్పి వివరాలను రాబట్టారు. మొత్తంగా ఐదు లావాదేవీల్లో రూ.72 వేలు కాజేశారు.
ఎయిర్లైన్స్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి అక్కా చెల్లెండ్లకు సైబర్నేరగాళ్లు రూ.40 లక్షలు టోకరా వేశారు. ఓ బాధితురాలు జాబ్పోర్టల్లో తన బయోడేటాను అప్లోడ్ చేయడంతో తమ వద్ద ఉద్యోగాలున్నాయని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ప్రాసెస్ చేస్తామంటూ నమ్మించారు. కొంత డబ్బు చెల్లించిన తరువాత బాధితురాలు, మా సోదరికి కూడా ఉద్యోగం కావాలని అడుగగా ఎయిర్ లైన్లోనే హెచ్ఆర్ ఉద్యోగం ఉందంటూ నమ్మించి మరింత డబ్బు లాగేశారు. నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షలు వారి నుంచి కాజేశారు.
కూకట్పల్లికి చెందిన ఓ వ్యాపారి తన క్రెడిట్ కార్డు బిల్లును హెచ్డీఎఫ్సీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించారు. అయితే ఈ నగదు క్రెడిట్ కార్డు ఖాతాకు చేరినట్టు మెసేజ్ రాలేదు. దీంతో వెంటనే గూగుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేశాడు. కాల్ మాట్లాడిన అవతలి వ్యక్తి వ్యాపారి నుంచి ఖాతా వివరాలు సేకరించాడు. ఆ తర్వాత చెల్లించిన నగదు వాపస్ రావాలంటే క్విక్ సపోర్టు యాప్, టీమ్ వ్యూవర్ను డౌన్లోడ్ చేసుకోమన్నాడు. ఓ రూపాయిని గూగుల్ పే ద్వారా బదిలీ చేయమన్నాడు. ఈ ప్రక్రియలో వ్యాపారి యూపీఐ, ఐడీ, పిన్ నంబర్లను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు మొత్తం 12 లావాదేవీలు జరిపి మొత్తం రూ.1.61 లక్షలను దోచేశారు.
ఇద్దరు వ్యాపారులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు సికింద్రాబాద్లోని రెండు వేర్వేరు ప్రైవేట్ బ్యాంకులో ఉండగా.. సైబర్ నేరగాళ్లు ఆ బ్యాంకులకు ఫోన్లు చేశారు. కరోనా కారణంగా ఐసొలేషన్లో ఉన్నామని.. బ్యాంకుకు రాలేకపోతున్నందున లెటర్హెడ్పై మెయిల్ చేశామని.. అందులో సూచించిన ఖాతాలకు నగదు జమ చేయాలని కోరగా.. ఇది నిజమని నమ్మిన బ్యాంకు అధికారులు ఒక ఖాతా నుంచి రూ.23 లక్షలు, మరో ఖాతా నుంచి రూ.5.4 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు జమ చేశారు.
మ్యాట్రిమోని సైట్లో ఓ యువతి ప్రొఫైల్ చూసిన సైబర్నేరగాడు స్కాట్లాండ్లో కంటి డాక్టర్ను అంటూ నమ్మించాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి కొన్ని రోజులు చాట్ చేశాడు. అనంతరం బహుమతి పంపానని చెప్పాడు. ఆ తర్వాత ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ మాట్లాడిన సైబర్ నేరగాళ్లు ఆ యువతి నుంచి రూ.9లక్షలు కాజేశారు.