ఢిల్లీ లాక్డౌన్, బెంగాల్ ఎన్నికలతో తగ్గిన ‘మోసగాళ్ల’ కదలికలు
అక్కడ మూతపడ్డ కాల్సెంటర్లు
జాబ్, ఇన్సూరెన్స్ మోసాలకు విరామం
ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన ఫిర్యాదులు
సైబర్ నేరాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఢిల్లీలో లాక్డౌన్ కారణంగా సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టాయి.. బెంగాల్ ఎన్నికలతో కూడా వారి కదలికలు చాలావరకు తగ్గాయి.. ఆయా ప్రాంతాల్లో ఉన్న కాల్సెంటర్లు సైతం మూతపడ్డాయి. ఫలితంగా సైబర్నేరాలు తగ్గాయి. మార్చి వరకు ప్రతి రోజు 10 నుంచి 15 కేసులు నమోదయ్యేవి.. కనీసం 30 ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్లోని అన్ని పోలీస్స్టేషన్లతోపాటు సీసీఎస్ సైబర్ ఠాణాకు రోజుకు 3 కేసుల చొప్పున నమోదవుతున్నాయి.
ఢిల్లీలో కాల్సెంటర్లు మూతపడటంతో ప్రస్తుతం అక్కడి నుంచి జరిగే మోసాలకు అడ్డుకట్ట పడ్డాయి. సైబర్నేరగాళ్ల చేతిలో ఎక్కువగా మోసపోయేవారు విద్యావంతులే ఉంటున్నారు. ఉద్యోగాలు, రుణాల కోసం ప్రయత్నించే వారిని ఢిల్లీ సైబర్ ముఠాలు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాయి. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో సైబర్ ముఠాల అడ్డాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలోనే అటు వైపు నుంచి నేరగాళ్లు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తున్నది. అందుకే ప్రస్తుతం ఆ సైబర్ నేరాలు చాలావరకు తగ్గాయి. – కేవీఎం ప్రసాద్, సీసీఎస్ సైబర్క్రైమ్స్ ఏసీపీ
పశ్చిమబెంగాల్లో ఎక్కువ సంఖ్యలోనే సైబర్నేర ముఠాలు ఉంటాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో సైబర్నేరగాళ్లు కొంత విరామం ఇచ్చారు. ఇన్సూరెన్స్, ఫ్రెండ్షిప్ క్లబ్స్, జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. అయితే రెండు నెలలుగా అక్కడ ఎన్నికల వాతావరణం ఉంది. దీంతో సైబర్నేరగాళ్లు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడమో, లేక ఇతర కారణాలతో గానీ .. అక్కడి నుంచి జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి.
ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగుతుండటంతో సైబర్నేరగాళ్ల అడ్డాలకు తాళా లు పడ్డాయి. ఉద్యోగాలు, ఇన్సూరెన్స్, సెల్ టవర్స్, వ్యాపార లావాదేవీలు, ఫ్రెండ్షిప్, మంచి కాలేజీల్లో సీట్లు.. ఇలా పలు రకాల మోసాలకు కాల్సెంటర్లను అడ్డాగా చేసుకొని డబ్బులు కాజేశారు. వివిధ పద్ధతుల ద్వారా ప్రజల కాల్డాటాను సేకరించి.. ఢిల్లీలోని కాల్సెంటర్ల ద్వారా దేశంలోని అన్ని రాష్ర్టాల వారికి ఫోన్లు చేయించి మాటలతో మాయచేసి మోసాలకు పాల్పడ్డారు. ఫోన్లు చేసి నమ్మించడంలో టెలీకాలర్స్దే కీలకపాత్ర. అయితే.. ఈ కాల్సెంటర్లు ఇప్పుడు మూతపడ్డాయి. సాధారణంగా ఢిల్లీకి సంబంధించిన సైబర్మోసాలు రోజుకు 7 వరకు నమోదవుతుంటాయి. ఇప్పుడు ఒకటి రెండు కూడా కావడం లేదు. ఈ ఏడాది మార్చి 31 వరకు సీసీఎస్ సైబర్ఠాణాలో 863 కేసులు…అంటే నెలకు 288 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ నెల 10వ తేదీ తరువాత ఇప్పటి వరకు కేవలం 60 కేసులే నమోదయ్యాయి.