సైబర్ నేరగాళ్ల వలలో మరికొందరు పడ్డారు. ఓటీపీ…క్యూఆర్ కోడ్… కేవైసీ.. పెట్టుబడికి అధిక లాభాలు.. ఇలా పాత కథలనే అస్ర్తాలుగా ఉపయోగించిన నేరస్తులు … అత్యాశ..అమాయకత్వాన్ని మరోసారి తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కనిపించని మాయగాళ్లతో జాగ్రత్త సుమా… అని ఎంత అవగాహన కల్పిస్తున్నా…మళ్లీ అదే తరహాలో మోసపోయారు జనాలు. చీటర్ల మాయమాటలు నమ్మి…రొటీన్గా ఖాతాలు ఖాళీ చేసుకున్నారు.
బంజారాహిల్స్,సెప్టెంబర్ 22: బంజారాహిల్స్ రోడ్ నం.3లోని అరోరా కాలనీలో నివాముంటున్న న్యాయ వాది శ్రీనివాస్బాబాకు ఈ నెల 20న గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో కేవైసీ వివరాలు అప్డేట్ లేనందున ఖాతాను సస్పెండ్ చేస్తున్నామని, కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో లింక్ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలని సూచిస్తూ.. లింక్ను పంపించాడు. అది ఓపెన్ చేసిన శ్రీనివాస్ బాబా.. వివరాలను పోస్ట్ చేశాడు. ఓటీపీలు సైతం నమోదు చేయాలని సందేశాలు రావడంతో బాధితుడు ఆ ప్రక్రియ కూడా పూర్తి చేశాడు. మూడుసార్లు ఓటీపీ నంబర్లు పంపడంతో రూ.65వేలు ఆయన అకౌంట్లో నుంచి డ్రా అయ్యాయి. బాధితుడు మంగళవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీడీ కాలనీలో నివాసముంటున్న ఆనంద్కిశోర్ జూబ్లీహిల్స్లో ఆర్కిటెక్ట్గా పనిచేస్తుంటాడు. తన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న సోఫాను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి.. సోఫాను తాను కొనుగోలు చేస్తానని చెప్పాడు. రూ.28,500కు భేరం కుదిరింది. డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ.. క్యూ ఆర్ కోడ్ను పంపిస్తే..దాన్ని స్కాన్ చేసి రూపాయి వేయాలని సూచించాడు. దీంతో బాధితుడు అతడు చెప్పినట్లు చేయగానే రూ.28,500 ఐసీఐసీఐ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. ఆనంద్కిశోర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నగరానికి చెందిన ఓ వ్యాపారికి నైజీరియన్ సైబర్నేరగాళ్లు రూ. 43లక్షలు టోకరా వేశారు. అబ్దుల్లా ఆదిల్ వృత్తి రీత్యా బిల్డర్. అతడి వాట్సాప్కు ‘హాయ్… మీరు డైమండ్ బిజినెస్ చేస్తారా’…అంటూ (+44 నంబర్తో) మెసేజ్ రావడంతో..నో చెప్పాడు. రెండ్రోజుల తర్వాత మళ్లీ సందేశం పెట్టడంతో ఈ సారి ఒకే అన్నాడు. దీంతో మాట కలిపిన సైబర్నేరగాళ్లు.. ఐడీఎక్స్. అప్ప్యాక్ట్.క్లబ్ పేరుతో ఒక వెబ్సైట్ లింక్ పంపించారు. ఆ తర్వాత యాప్ డౌన్లోడ్ చేయించి… రూ.50వేలు పెట్టుబడి పెట్టించారు. మరుసటి రోజు వెయ్యి రూపాయల లాభం తీసుకున్న బాధితుడు.. తిరిగి రూ.4 లక్షలు డిపాజిట్ చేశాడు. ఈసారి ఆ అప్లికేషన్లో రూ.8 లక్షలు చూపించింది. అయితే డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో బాధితుడు ఆ ఫోన్ నంబర్లను సంప్రదించాడు. ‘మరింత పెట్టుబడి పెట్టండి మార్కెట్ బాగుంది.. లాభాలొస్తాయం’టూ.. మళ్లీ నమ్మించి.. మొత్తం రూ. 43 లక్షలు పెట్టించారు. స్క్రీన్పై రూ.1.5కోట్లు కనిపించడంతో…‘అవన్నీ మీకేనం’టూ..మరికొంత పెట్టుబడి పెట్టాలన్నారు. మోసమని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): మార్కెట్ ధరకంటే 15 శాతం తక్కువ రేటుకే బంగారం ఇస్తామని ఒకరికి కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు. ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి తన స్నేహితుడి ద్వారా తిరుమల్ పరిచయమయ్యాడు. ఫోన్లో తిరుమల్ను సంప్రదించినప్పుడు బంగారాన్ని మార్కెట్ ధర కంటే 15 శాతం తక్కువకు ఇస్తానని నమ్మించాడు. ఆశపడ్డ బాధితుడు తన భార్య కోసం 10 తులాల బంగారం కావాలంటూ.. కోరాడు. ముందుగా డబ్బు చెల్లించాలని సూచించడంతో.. రూ. 3 లక్షలను తిరుమల్ అకౌంట్కు వేశాడు. తర్వాత అతడి ఫోన్ బంద్ అయింది. బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉన్నది.