సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఖండాంతరాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. అమెరికాలోని డల్లాస్ నగరంలో సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కళాశాల 20 ఏండ్ల వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటిసారి కాలిఫోర్నియాలో పూర్వ విద్యార్థులు సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం రెండో సమావేశాన్ని డల్లాస్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ డాక్టర్ సీవీ రాఘవ హాజరై పూర్వ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదివిన రోజులను నెమరేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం రోహిత్ ఉప్పాల అధ్యక్షతన జరిగింది.