ఎంత చదువు చదివినా.. అతని బుద్ధి మాత్రం పెడదోవ పట్టింది. రెండు పీజీలు చేసినా.. అందులోనూ సైకాలజీ స్టూడెంట్ అయినా సరే.. క్రిమినల్లాగే ఆలోచించాడు. పెద్దపెద్ద కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేసే వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వారి వద్ద బిట్కాయిన్స్ డిమాండ్ చేశాడు. చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో నగ్న ఫొటోలు పెట్టి ఇబ్బందులు పెట్టాడు. టెక్నాలజీ సాయంతో ఎక్కడా ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ… రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అదే టెక్నాలజీతో అతడిని పట్టేశారు. చివరకు తాను పోలీసులకు ఎలా చిక్కాడో తెలుసుకొని తెల్లమొఖం వేయడం నిందితుడి వంతయ్యింది.
తమిళనాడు రేవతీపురం ఉరపాకం ప్రాంతానికి చెందిన తమిళ సెల్వన్ బీసీజే, ఎంబీఏ చదివాడు. 2020లో ఎమ్మెల్సీ సైకాలజీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. లాక్డౌన్ కారణంగా జాబ్ రాకపోగా.. అతని తమ్ముడి ఉద్యోగం కూడా పోయింది. ఇంత చదువు చదివి ఊరికే ఉండటం.. అలవాట్లకు అవసరమైన డబ్బు దొరక్కపోవడంతో దొడ్డిదారి పట్టాడు. పేరొందిన పలు వెబ్సైట్ల నుండి సీనియర్ మహిళా ఫ్యాకల్టీల ఫొటోలు, ఫోన్ నంబర్లను సేకరించాడు తమిళ సెల్వన్. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు తయారు చేసి వాటిని నేరుగా బాధితులకు పంపించాడు. ఇలా చేస్తున్న క్రమంలో తాను ఎవరో తెలియకుండా ఉండేందుకు సెల్వన్ టెలిగ్రాం యాప్ను వినియోగించాడు. అందులో ఉన్న హిడెన్ హిస్టరీ ద్వారా తన వివరాలు తెలియకుండా బ్లాక్ చేశాడు.
తమిళ సెల్వన్ ఫొటోలు పంపించినా ఎవరూ స్పందించకపోవడంతో కొత్త ఎత్తుగడ వేశాడు. టెలిగ్రాం, పిన్రెస్ట్ యాప్ల ద్వారా తన పథకాన్ని ప్రారంభించాడు. బాధిత మహిళల ప్రొఫైల్స్, ఫొన్ నంబర్లతోనే యాప్ల ద్వారా వారి నగ్న చిత్రాలు షేర్ చేశాడు. మీరు నాతో మాట్లాడాలంటే.. మళ్లీ ఆ ఫొటోలను వాట్సాప్ ద్వారా తనకు పంపించాలని చెబుతూ.. ఆ ఫొటోలు మళ్లీ బాధితులకే చేరేలా ప్లాన్ చేశాడు.
ఫొటోలు ఇతరుల ద్వారా బాధితులకు చేరిన తర్వాత తమిళ సెల్వన్ వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ప్రచారం ఆగిపోవాలంటే 300 అమెరికా డాలర్లల బిట్కాయిన్లు కొనుగోలు చేసి తాను సూచించిన ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేసేవాడు. అయితే… టెలిగ్రాం, పిన్రెస్ట్ యాప్లు వాడటం ద్వారా తనకు సంబంధించిన ఫోన్ నంబర్లు గానీ.. ఐపీ అడ్రస్లు గానీ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు.
అయితే.. ఇటీవలే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ బాధితురాలు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. తన ఫొటో మార్ఫింగ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని, తన ప్రతిష్టకు భంగం కలిగించకుండా కాపాడాలని ఓ పేరొందిన కళాశాలకు చెందిన మహిళా ఫ్యాకల్టీ పోలీసులను కోరింది. దీంతో రాచకొండ సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ వెంకటేశ్ బృందం రంగంలోకి దిగింది. టెలిగ్రాంతో పాటు.. పిన్రెస్ట్ యాప్ వాడటం వల్ల నిందితుడి ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారింది. ఇక పిన్రెస్ట్ యాప్లో బ్రౌజ్ చేస్తే అది ఎవరు బ్రౌజ్ చేస్తున్నారో వారి ఆచూకీనే చూపించడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. కానీ.. అదే టెక్నాలజీతో కేవలం 5 రోజుల్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు.. శుక్రవారం తమిళ సెల్వన్ను అరెస్టు చేశారు.
అయితే.. అరెస్టు చేయడానికి వెళ్లిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులతో తమిళ సెల్వన్ వాగ్వాదానికి దిగాడు. ‘ఏ ఆధారాలతో నన్ను అరెస్టు చేస్తున్నారు ? నా ఫోన్ నంబర్ గానీ.. నా ఐపీ అడ్రస్ గానీ ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు. మా నాన్న కూడా సీఆర్పీఎఫ్లో ఏఎస్గా పనిచేస్తున్నారు. మీ మీద పరువు నష్టం దావా వేస్తాను’ అంటూ బెదిరింపులకు దిగాడు. చివరకు నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి పోలీసులు చెప్పగానే.. తమిళ సెల్వన్ నోరు వెల్లబెట్టాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. 200 మంది మహిళకు ఒత్తిడిని దూరం చేశారు.