బంజారాహిల్స్,సెప్టెంబర్ 7 : కిరాయికి ఉన్న ఇంటి యజమానిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని టీడీపీ ఆఫీసుకు పక్కనున్న హుడా లే అవుట్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్.నిర్మలాదేవికి ఉన్న ఇంటిని ఏడేళ్లుగా అభిషేక్రెడ్డి అనే వ్యక్తి కిరాయికి తీసుకుని ఆఫీసు పెట్టుకున్నాడు.
ఇంటిని ఖాళీ చేయకపోవడంతో నిర్మలాదేవి నోటీసు ఇచ్చింది. దాంతో సెప్టెంబర్ 1న ఖాళీ చేస్తానని చెప్పాడు. చెప్పిన మేరకు ఇంటిని ఖాళీ చేసిన అభిషేక్ రెడ్డి అడ్వాన్స్గా ఇచ్చిన రూ.40వేలు తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగేందుకు నిర్మలాదేవి ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లోని ఇంటీరియర్ను పాడుచేసినందున వాటి మరమ్మతులు చేయించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆమె కోరింది.
దీంతో ఆగ్రహానికి లోనయిన అభిషేక్రెడ్డి దుర్భాషలాడడంతో పాటు ఇంట్లోకి ప్రవేశించి చెంపదెబ్బ కొట్టాడు.ఈ మేరకు బాధితురాలు సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.