ఐపీఎల్ అంటేనే బెట్టింగ్లకు అడ్డా.. ఎప్పుడెప్పుడా అని బెట్టింగ్ రాయుళ్లు ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్లు మొదలయ్యాయి. నగర శివారులో బెట్టింగ్లు ఊపందుకున్నాయి. బంతి బంతికో లెక్క.. సిక్స్ కొట్టినా.. ఫోర్ కొట్టినా.. సింగిల్ తీసినా.. టుడీ తీసినా.. బంతి బ్యాట్కు తాకినా.. ఔట్ అయినా.. ఇలా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. మ్యాచ్ ముగిసే సమయానికి ఈ బెట్టింగ్ల దందా వేలు వీడి లక్షలకు చేరుతుంది. దీంతో నగర శివారు యువత బెట్టింగ్ మాఫియాకు బానిసలై.. లక్షలు పోగొట్టుకుంటున్నారు. వీటికి కేరాఫ్ సెల్ ఫోన్లే కావడం విశేషం. ఇంతా జరుగుతున్నా.. నగర శివారు పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
నగర శివారు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ పేరు మార్చాం. సన్ రైజర్స్ తరఫున విన్నింగ్ బెట్టింగ్ రూ.5వేలు కట్టాడు. మ్యాచ్ చివరకు వచ్చే సరికి తీవ్రమైన ఉత్కంఠకు రావడంతో బంతి బంతికో లెక్క చొప్పున బెట్టింగ్ కట్టాడు. సిక్స్ కొడితే వెయ్యి.. ఫోర్ కొడితే రూ.500 ఇలా బెట్టు కట్టాడు. చివరకు జేబుకు బారీగానే చిల్లు పెట్టుకున్నాడు.
అసలే కరోనా కష్టకాలం.. ఆపై స్కూళ్లు.. కాలేజీలన్నీ ఆన్లైన్ పాఠాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. కావాల్సినంత డాటా ఉంటుంది. ఇకేముంది సాయంత్రం అయ్యిందంటే చాలు బెట్టింగ్లకు రెడీ అవుతున్నారు. ఎక్కడచూసినా సెల్ఫోన్లలో చిట్చాట్లు.. బెట్టింగ్ చాటింగ్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్పై శివారు ప్రాంతాలైన నార్సింగి, మణికొండ, హైదర్షాకోట్, మంచిరేవుల, పుప్పాల్గూడ, కోకాపేట, ఖానాపూర్, గండిపేట, వట్టినాగులపల్లి తదితర ప్రాంతాల్లో బెట్టింగ్ దందా జోరందుకుంది. ఎక్కడికక్కడ బెట్టింగ్ రాయుళ్లు తిష్టవేసి యువతకు గాలం వేసి బెట్టింగ్ ముగ్గులోకి దింపుతున్నారు. వెయ్యికి వెయ్యి.. లక్షకు లక్ష.. ఇలా ఎంతస్థాయిలోనైనా సరే ఫోన్లలో బెట్టింగ్లు నిర్వహిస్తూ.. వారి వ్యాపారాలను మూడుపువ్వులు.. ఆరుకాయలుగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల కిందట గ్రామాల్లో పర్యటించిన కొంత మంది బెట్టింగ్రాయుళ్లు గ్రామాల్లోని యువతను బెట్టింగ్ ముగ్గులోకి దింపడంతో యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు దాసోహమవుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు నలుగురు ఒకదగ్గర కలిసి టీవీ ముందు కూర్చోని పలానా టీం పక్షాన తన బెట్టింగింత.. అంటూ యథేచ్ఛగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. వంద నుంచి మొదలైన ఈ వ్యవహారం ప్రస్తుతం పదివేలు.. ఇరవై వేలు.. లక్ష రూపాయల వరకు నడుస్తుందంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
బెట్టింగ్ రాయుళ్లపై ఎప్పుటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ నిఘా నేత్రం పూర్తిగా క్షీణించడంతోనే శివారు ప్రాంతాల్లో బెట్టింగ్లు జోరందుకున్నట్లు తెలుస్తున్నది. పోలీసులు, ఎస్ఓటీ, ప్రత్యేక బృందాలున్నప్పటికీ ఈ బెట్టింగ్ల వ్యవహారాలను పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు యువకులు గ్రామ శివారుల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసుకుని అందులో టీవీలు పెట్టుకుని బెట్టింగ్లు నడిపిస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్లో హైదర్షాకోట్ లో ఓ బెట్టింగ్ ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని వారివద్ద నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. ఇక నార్సింగి, మణికొండ, మంచిరేవుల, పుప్పాల్గూడ తదితర ప్రాంతాల్లోని అపార్టుమెంట్లలో యథేచ్ఛగా బెట్టింగ్లు నిర్వహిస్తుండగా, ఖానాపూర్, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో చిన్నచిన్న కిరాణాకొట్టులలో యువత బెట్టింగ్లు కాస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బెట్టింగ్ రాయుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని యువతను సన్మార్గంలోకి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
మ్యాచ్ మొదలైందంటే చాలు సెల్ ఫోన్లలోనే బెట్టింగ్లు షురూ చేస్తున్నారు. ఈ రోజు మ్యాచ్పై తన వాటా.. లేదా తమ నలుగురి బెట్టింగ్ ఇంతా అంటూ సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం.. మ్యాచ్ గెలిచినా ఓడినా ఆ గ్రూపంతా ఓ చోట కలుసుకుని డబ్బులు పంచుకోవడం శివారు గ్రామాల్లో పరిపాటిగా మారింది. సెల్ఫోన్లలో యథేచ్ఛగా మెసేజ్లు పెట్టి బెట్టింగ్లు కాస్తున్నారు.