న్యూఢిల్లీ, జూన్ 3: వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. 30 కోట్ల డోసుల కోసం హైదరాబాద్కు చెందిన ఫార్మా సంస్థ బయలాజికల్-ఈతో ఈ మేరకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకోసం ఆడ్వాన్స్ పేమెంట్ కింద రూ.1500 కోట్లు చెల్లించనున్నది. ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో ఆ సంస్థ టీకాలను అందజేయనున్నదని కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవాగ్జిన్ తర్వాత అందుబాటులోకి రానున్న రెండో దేశీయ టీకా ఇదే. అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్తో కలిసి బయలాజికల్ ఈ సంస్థ కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఇది ప్రస్తుతం మూడో దశ హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నది. ఇంతకుముందు ట్రయల్స్లో టీకా సమర్థతపై మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో బయలాజికల్ ఈ సంస్థతో కేంద్రం ఒప్పందం చేసుకొన్నది. స్వదేశీ టీకాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ సంస్థకు రూ.100 కోట్ల ఆర్థిక సహకారం అందించడంతో పాటు పరిశోధనల్లో కూడా సాయం చేస్తున్నది.